నిర్మాణ వ్యయం ముంబైలో ఎంతో చౌక
టర్నర్, టౌన్సెండ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: డేటా సెంటర్లకు భారత్ ప్రపంచంలోనే ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా ఉన్నట్టు టర్నర్ అండ్ టౌన్సెండ్ డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. డేటా సెంటర్ల నిర్మాణ వ్యయం పరంగా ముంబై ప్రపంచంలో రెండో చౌక కేంద్రంగా ఉన్నట్టు వెల్లడించింది. ఒక వాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ నిర్మాణానికి ముంబైలో 6.64 డాలర్లు ఖర్చవుతోందని, ప్రపంచవ్యాప్తంగా 52 ప్రాంతాల్లో ముంబైకి 51వ ర్యాంక్ దక్కినట్టు తెలిపింది.
ఒకటో ర్యాంక్ వస్తే, మెగావాట్ డేటాసెంటర్ నిర్మాణానికి అత్యధిక వ్యయం అవుతున్నట్టు, 52 వస్తే అతి చౌక అని అర్థం చేసుకోవాలి. టోక్యో, సింగపూర్, జూరిచ్ ప్రాంతాల్లో మెగావాట్ నిర్మాణ వ్యయం ముంబై కంటే రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు ఈ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. దీంతో డేటా సెంటర్ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయంగా ఉన్నట్టు పేర్కొంది. ముంబైలో విద్యుత్ టారిఫ్లు కిలోవాట్ హవర్కు 6.71 సెంట్లుగా ఉందని, షాంఘై కంటే 50 శాతం చౌక అని తెలిపింది. దీంతో డేటా సెంటర్ల నిర్వహణ వ్యయాలు ముంబైలో తక్కువని తేల్చింది.
నిల్వ సామర్థ్యం 3 శాతమే
ప్రపంచంలో 20 శాతం డేటా భారత్లో ఉత్పత్తి అవుతుండగా, డేటా సెంటర్ సామర్థ్యంలో కేవలం 3 శాతమే భారత్లో ఉందని తెలిపింది. డేటా స్టోరేజీ కోసం భారత్ విదేశీ హోస్టింగ్(నిల్వ)పై ఎక్కువగా ఆధారపడుతోందని, దీంతో స్థానికంగా సామర్థ్య విస్తరణకు అపార అవకాశాలున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జపాన్, సింగపూర్తోపాటు భారత్ డేటా సెంటర్ మార్కెట్లుగా ఉన్నాయని.. భారత్లో డేటా సామర్థ్యాల నిర్మాణానికి 156 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని పేర్కొంది.
తక్కువ నిర్మాణ వ్యయానికి తోడు డేటా స్టోరేజీ డిమాండ్ నేపథ్యంలో డేటా సెంటర్ల పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా కొనసాగుతుందని టర్నర్ అండ్ టౌన్సెండ్ ఎండీ సుమిత్ ముఖర్జీ తెలిపారు. వ్యయపరమైన అనుకూలతలు ఉన్నప్పటికీ.. అవసరమైనంత విద్యుత్, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన సవాళ్లున్నట్టు చెప్పారు. ఇంధన వినియోగం పరంగా మరింత అనుకూలమైన డేటా సెంటర్ డిజైన్లపై సంస్థలు దృష్టి పెట్టాలని, తద్వారా విద్యుత్కు సంబంధించి రిస్్కను తగ్గించుకోవచ్చని నివేదిక సూచించింది. ఏఐ పరివర్తన ప్రయోజనాలను పూర్తి స్థాయిలో అందుకునేందుకు విద్యుత్, నీటి సరఫరాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని
ప్రస్తావించింది.


