బొగ్గు బ్లాక్‌ల వేలంలో టాప్‌.. యాక్సిస్‌ ఎనర్జీ, రిలయన్స్‌ | Axis Energy Reliance Top Bidders in Coal Blocks Auction for Gasification | Sakshi
Sakshi News home page

బొగ్గు బ్లాక్‌ల వేలంలో టాప్‌.. యాక్సిస్‌ ఎనర్జీ, రిలయన్స్‌

Dec 28 2025 8:55 AM | Updated on Dec 28 2025 10:35 AM

Axis Energy Reliance Top Bidders in Coal Blocks Auction for Gasification

దేశీయంగా బొగ్గు గ్యాసిఫికేషన్‌ను, స్వచ్ఛ ఇంధనాల ఉత్పత్తిని పెంచే దిశగా నిర్వహించిన బొగ్గు బ్లాక్‌ల వేలంలో యాక్సిస్‌ ఎనర్జీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థలు టాప్‌ బిడ్డర్లుగా నిల్చాయి. హైదరాబాద్‌కి చెందిన పునరుత్పాదక విద్యుత్‌ సంస్థ యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా, వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంయుక్తంగా 17 బ్లాక్‌లకు బిడ్‌ చేసినట్లు సాంకేతిక బిడ్స్‌ను తెరిచిన మీదట వెల్లడైంది.

ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఈ బ్లాక్‌లు ఉన్నాయి. ఇతరత్రా బిడ్డర్లలో పెన్నా ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ఒరిస్సాలో ఒక బ్లాక్‌కి, ఎన్‌ఆర్‌ఎస్‌కే మైన్స్‌ అండ్‌ మినరల్స్, క్యాలిబర్‌ మైనింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ చెరి రెండు బ్లాక్‌లకు బిడ్‌ చేశాయి. సింగరేణి కాలరీస్‌–తెలంగాణ పవర్‌ జెనరేషన్‌ కార్పొరేషన్, సాయి సూర్యా ప్రొఫెషనల్‌ సరీ్వసెస్, ఎంఎంపీఎల్‌ కమర్షియల్‌ మైన్స్, మోహిత్‌ మినరల్స్‌ మొదలైనవి బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి.  

బొగ్గును ఉద్గారాలు తక్కువగా ఉండే సింథసిస్‌ గ్యాస్‌ (సిన్‌గ్యాస్‌) ఇంధనం రూపంలోకి మార్చడాన్ని కోల్‌ గ్యాసిఫికేషన్‌గా వ్యవహరిస్తారు. పర్యావరణహిత సిన్‌గ్యాస్, హైడ్రోజన్, మిథనాల్‌లాంటివి దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా సహజ వాయువు, ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని తలపెట్టింది. 2030 నాటికి 100 మిలియన్‌ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయాలని నిర్దేశించుకుంది.

ఇందులో భాగంగా అక్టోబర్‌లో నిర్వహించిన 14వ విడత వేలం కోసం 41 గనులను ఎంపిక చేసింది. వీటిలో 24 బ్లాక్‌లకు 49 బిడ్లు వచ్చాయి. రెండు, అంతకు మించిన సంఖ్యలో బిడ్డర్లు ఉన్న బ్లాక్‌ల బిడ్లను మాత్రమే తెరిచారు. యాక్సిస్‌ ఎనర్జీ, రిలయన్స్‌ లాంటి దిగ్గజాలు ఇందులో పాల్గొడమనేది కోల్‌ గ్యాసిఫికేషన్‌ పాలసీపై ప్రైవేట్‌ రంగానికి గల నమ్మకానికి నిదర్శనమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement