మారుతున్న కాలానికి అనుగుణంగా పెట్టుబడి మార్గాలు ఎన్ని వచ్చినా.. యువత మాత్రం ఇప్పటికీ బంగారం పైనే గట్టి నమ్మకం పెట్టుకుంటున్నారు. దేశంలోని జనరేషన్ జెడ్ (జెన్ జీ), మిలీనియల్స్ పెట్టుబడుల ధోరణిపై స్మిట్టన్ పల్స్ ఏఐ నిర్వహించిన తాజా సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 5,000 మంది యువత (18-39 ఏళ్లు) అభిప్రాయాలను సేకరించిన ఈ నివేదిక ప్రకారం.. సురక్షితమైన పెట్టుబడిగా 62 శాతం మంది బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు.
ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో సేవింగ్స్ అకౌంట్లు, ఈక్విటీల కంటే బంగారమే తమకు ధీమా ఇస్తుందని 65.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఒకవేళా రూ.25,000 పెట్టుబడి పెట్టాల్సి వస్తే.. పెట్టుబడి మొత్తాన్ని కింది విధంగా విభజించనున్నట్లు సర్వేలో వెల్లడైంది.
➤బంగారం: 61.9 శాతం
➤మ్యూచువల్ ఫండ్లు: 16.6 శాతం
➤ఫిక్స్డ్ డిపాజిట్లు: 13 శాతం
➤స్టాక్ మార్కెట్: 6.6 శాతం
➤క్రిప్టో కరెన్సీ: 1.9 శాతం
గతంలో బంగారం కొనుగోలు అంటే.. కుటుంబం అంతా కలిసి తీసుకునే పెద్ద నిర్ణయంగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 66.7 శాతం కొనుగోళ్లు పూర్తిగా వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగానే జరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల ప్రమేయం తగ్గుతోంది. 61.9 శాతం మంది తాము చేసిన ఇటీవలి కొనుగోలు 5 గ్రాముల లోపే ఉందని తెలిపారు. అందులో 27.5 శాతం మంది 2 గ్రాముల కంటే తక్కువ పరిమాణంలోనే కొనుగోలు చేశారు. జెడ్ జీ యువత తమ మొదటి జీతం (24.3 శాతం) అందగానే గోల్డ్ కొనుగోలు చేయాలని భావిస్తారు.
డిజిటల్ ప్లాట్ఫారమ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు కూడా యువత ప్రాధాన్యత ఇస్తోంది. పెద్ద గోల్డ్ బ్రాండెడ్ షోరూమ్లలో 38.3%, స్థానిక జ్యువెలరీ దుకాణాలలో 34.7 శాతం, ఆన్లైన్/యాప్స్ ద్వారా బంగారం కొనుగోలు చేసేందుకు 5.2 శాతం యువత ఆసక్తిగా చూపుతున్నారు.
ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?
బంగారం కొంటున్నారు. కానీ కొనేటప్పుడు ప్రధానంగా ప్యూరిటీ విషయంలో 49.4 శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మేకింగ్ ఛార్జీలు (21 శాతం), రీసేల్ వాల్యూ (17 శాతం)పై మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బంగారం కొన్న తర్వాత 67.1 శాతం మంది ఏదో ఒక సమయంలో బాధపడినట్లు సర్వేలో వెల్లడయ్యాయి.
కొనుగోలులో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బంగారంపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రాబోయే 12 నుంచి 24 నెలల్లో కచ్చితంగా బంగారం కొంటామని 52.7 శాతం మంది యువత ధీమా వ్యక్తం చేశారు. ఎక్కువ పెట్టుబడిగా కాకుండా.. క్రమ పద్ధతిలో, చిన్న మొత్తాల్లో బంగారం కొనుగోలు చేయడమే ట్రెండ్ అని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.


