
దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేసి మొత్తం ఎయిర్పోర్ట్ల సంఖ్యను 212కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం (ఐఏటీఏ) వార్షిక సమావేశంలో ఈమేరకు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. ఈ విస్తరణలో ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కీలకంగా వ్యవహరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
దేశం అంతటా ప్రజలకు మరింత చౌకగా, అందుబాటు ప్రాంతాల్లో విమానప్రయాణం చేసేలా ఉడాన్ పథకం సంస్కరణలు తీసుకొస్తోంది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి 619 కొత్త మార్గాలను నెట్వర్క్లో జోడించింది. ఇది చిన్న పట్టణాలు, నగరాలకు ప్రత్యక్ష విమాన కనెక్టివిటీని పొందేందుకు దోహదపడుతుంది. విమానాశ్రయాల సంఖ్యను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమవుతుందని మంత్రి చెప్పారు.
ఇదీ చదవండి: 15 రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గింపు
ప్యాసింజర్ కనెక్టివిటీకి మించి భారత్ గ్లోబల్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ (ఎంఆర్ఓ) హబ్గా కూడా నిలదొక్కుకుంటోంది. 2031 నాటికి ఎంఆర్ఓ విభాగం 4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. దేశీయ, అంతర్జాతీయ విమానాల నిర్వహణ అవసరాలను తీర్చే ప్రపంచ స్థాయి సౌకర్యాలను సృష్టించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మార్పు విదేశీ మరమ్మతు సేవలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. భారతదేశ విమానయాన ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది.