మరో ఆరు రోజుల్లో చౌకగా విమాన ప్రయాణం | Hyderabad Airport Flight Ticket Prices Drop from Sept 1 AERA Slashes UDF | Sakshi
Sakshi News home page

మరో ఆరు రోజుల్లో చౌకగా విమాన ప్రయాణం

Aug 25 2026 8:09 PM | Updated on Aug 25 2026 8:21 PM

Hyderabad Airport Flight Ticket Prices Drop from Sept 1 AERA Slashes UDF

నింగిలో విహరించాలనుకునే సామాన్య మధ్యతరగతి ప్రయాణికులకు విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ సంస్థ (ఏఈఆర్‌ఏ) తీపి కబురు అందించింది. అందినంత పిండుకో అనే దోరణికి చెక్ పెడుతూ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) నుంచి పయనమయ్యే ప్రయాణికులపై యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (యూడీఎఫ్‌) భారాన్ని గణనీయంగా తగ్గించింది. సెప్టెంబరు 1, 2026 నుంచి ప్రారంభమయ్యే నాలుగో పర్యవేక్షణ కాలానికి (2026-2031) గాను ఈ సవరించిన టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి.

ఇప్పటివరకు దేశీయ విమాన ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న రూ.750 యూడీఎఫ్‌ను ఏఈఆర్‌ఏ రూ.515కు తగ్గించింది. విమానాశ్రయ నిర్వాహక సంస్థ జీఎంఆర్‌(బీహెచ్‌ఐఏఎల్) రూ.580 కోరినప్పటికీ ప్రయాణికుల ప్రయోజనాలే పరమావధిగా భావించి రూ.515 వద్దే నిర్ణయించడం విశేషం. అలాగే, అంతర్జాతీయ ప్రయాణికుల రుసుమును రూ.1,500 నుంచి రూ.1,030కి తగ్గించింది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారిలో దాదాపు 82 శాతం మంది దేశీయ ప్రయాణికులే కావడంతో ఈ నిర్ణయం వారికి ఊరటనివ్వనుంది.

ముందుగానే నియంత్రణ!

బీహెచ్‌ఐఏఎల్ ఏకంగా రూ.27,851 కోట్ల ఆదాయ అవసరాలు ప్రతిపాదించగా ఏఈఆర్‌ఏ పక్కాగా సమీక్షించి రూ.11,683.49 కోట్లకు కుదించి ఆమోదముద్ర వేసింది. విమానాల ల్యాండింగ్ చార్జీలను టన్నుకు రూ.435 (దేశీయ), రూ.630 (అంతర్జాతీయ)గా నిర్ణయించింది. విమానయాన సంస్థలను ప్రోత్సహించేందుకు వేరియబుల్ టారిఫ్ ప్లాన్ (వీటీపీ) పేరుతో ల్యాండింగ్ ప్రోత్సాహకాలను సైతం తీసుకొచ్చింది. మొత్తానికి, విమాన ప్రయాణం కేవలం సంపన్నులకే కాకుండా సగటు మానవుడికి సైతం చేతికందే పండులా మారనుండటం హర్షణీయం.

ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement