
ప్రముఖ నటుడు, పారిశ్రామికవేత్త వివేక్ ఒబెరాయ్ సంపద ఫోర్బ్స్ ఇండియా ప్రకారం దాదాపు రూ.1,200 కోట్లుగా ఉంది. ‘సాథియా’, ‘మస్తీ’, ‘రక్తచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఒబెరాయ్ ఇప్పుడు సినిమాల్లో తక్కువగానే కనిపిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ వెళ్లి ఫుల్ టైమ్ ఆంత్రప్రెన్యూర్గా మారారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యాపార సామ్రాజ్య పునాదికి దారితీసిన అంశాల గురించి, తండ్రి సురేష్ ఒబెరాయ్ చిన్నతనం నుంచే తనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఎలా నేర్పించారో చెప్పారు.
దుబాయ్ ప్రాపర్టీ ఇన్సైడర్ పాడ్కాస్ట్లో వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. ‘వ్యాపార మెలకువలు నేర్చుకునే తొలినాళ్లలో నాలో ఆర్థిక అవగాహన పెంపొందించిన ఘనత నా తండ్రికే దక్కుతుంది. అతను ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి నేను దాన్ని ఎలా విక్రయించబోతున్నాననే దానిపై వ్యాపార ప్రణాళికను రూపొందించమని అడిగేవారు. దాంతో నేను 10 ఏళ్ల వయసు నుంచే వ్యాపారంలోని సూక్ష్మాంశాలను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నా తండ్రి ఒక విషయం స్పష్టంగా చెప్పారు. తాను ధనవంతుడినని.. మేము కాదనే చెబుతుండేవారు. మేము ఎలా ఉండాలో నిర్ణయించుకోమన్నారు’ అని చెప్పారు.
ఇదీ చదవండి: 40 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వొచ్చు.. ఆర్థిక సూత్రం ఇదే..
‘ఈ కఠినమైన ప్రేమతో కూడిన విధానం టీనేజ్ నుంచే నన్ను తోటివారి కంటే భిన్నంగా ఆలోచించేలా చేసింది. చాలా మంది టీనేజర్లు స్కూళ్లలోని పాఠాలు నేర్చుకుంటుంటే.. నేను మాత్రం మార్కెట్, వ్యాపారం, స్టాక్స్.. వంటి ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన పెంచుకున్నాను. దాంతో నా మొదటి కంపెనీ కోసం 3 మిలియన్ డాలర్లు కూడబెట్టగలిగాను. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. తర్వాతి కాలంలో నా పెట్టుబడిదారుల కోసం చాలా డబ్బు సంపాదించాను. నా 23 ఏళ్ల వయసులో ఆ కంపెనీని విక్రయించాను. తర్వాత ఇతర కంపెనీలను కొనుగోలు చేశాను. ప్రస్తుతం తొమ్మిది సంస్థలను భారత స్టాక్ మార్కెట్లోకి తీసుకెళ్లగలిగాను. మరో నాలుగు కంపెనీలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని యోచిస్తున్నాను’ అని తెలిపారు.