రియల్టీలో ఆసక్తి.. లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు మొగ్గు | hnis uhnis keen on buying luxury ultra premium properties | Sakshi
Sakshi News home page

రియల్టీలో ఆసక్తి.. లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు మొగ్గు

Feb 22 2025 7:13 PM | Updated on Feb 22 2025 7:29 PM

hnis uhnis keen on buying luxury ultra premium properties

దేశీయ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ), అల్ట్రా హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (యూహెచ్‌ఎన్‌ఐ)లు ఆసక్తిగా ఉన్నారు. ఫలితంగా లగ్జరీ, అల్ట్రా ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్‌ పెరిగింది. 65 శాతం మంది హెచ్‌ఎన్‌ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు రూ.4–10 కోట్లు ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీ కొనుగోలుకు మొగ్గు చూపుతుండగా.. 13 శాతం మంది రూ.25 కోట్లకు పైన ధర ఉన్న స్థిరాస్తులపై ఆసక్తిగా ఉన్నారని ఇండియా సోత్‌బైస్‌ ఇంటర్నేషనల్‌ రియల్టీ(ఐఎస్‌ఐఆర్‌) వార్షిక సర్వే వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో  

  • కరోనాతో స్థిరాస్తి రంగానికి జరిగిన ప్రధాన మేలు.. సొంతింటి అవసరం తెలిసి రావడమే.. మరీ ముఖ్యంగా గృహ విభాగంలో యువతరం భాగస్వామ్యం పెరగడం. 74 శాతం సంపన్న కొనుగోలుదారులు ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు రియల్‌ ఎస్టేట్‌ ఒక ప్రధాన ఆస్తిగా పరిగణిస్తారు.

  • 61 శాతం మంది హెచ్‌ఎన్‌ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు 2024–25లో లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 34 శాతం మంది హైరైజ్‌ అపార్ట్‌మెంట్లు కొనుగోలుకు ఆసక్తిగా ఉండగా.. 30 శాతం మంది 
    ఫామ్‌హౌస్‌లు, హాలిడే హోమ్స్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే 23 శాతం మంది వాణిజ్య సముదాయాలలో పెట్టుబడులకు, 15 శాతం మంది స్థలాలపై ఆసక్తిగా ఉన్నారు.

  • గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 34 శాతం మంది హెచ్‌ఎన్‌ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ఇప్పటికీ చాలామంది కొనుగోలుదారులు లగ్జరీ గృహాల కోసం శోధిస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్లు దేశీయ రియల్టీ రంగం సరికొత్త రికార్డులను చేరుకుంటుందని విశ్వసిస్తున్నారు. 16 నెలలుగా లగ్జరీ గృహాల ధరలు పెరిగాయి. 2015 గరిష్ట ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదలేనని తెలిపారు.  

  • విశాలవంతమైన గృహాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాపర్టీలకే లగ్జరీ కొనుగోలుదారులు మొగ్గు చూపిస్తున్నారు. సంపన్న భారతీయుల ప్రాపర్టీ ఎంపికలో తొలి ప్రాధాన్యత మెరుగైన ఫిజికల్, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సదుపాయాలకే..

ఈ నగరాలే హాట్‌స్పాట్స్‌.. 
సంపన్న కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రధాన కారణం మెరుగైన జీవన శైలి. మూలధన వృద్ధి, భవిష్యత్తు తరాలకు ఆస్తి వంటివి ఆ తర్వాతి అంశాలు. ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, గోవా, బెంగళూరు నగరాలలో గృహాల కొనుగోళ్లకు హెచ్‌ఎన్‌ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది సంపన్నులు విదేశాలలో ప్రాపర్టీలకు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు తగ్గుముఖం పట్టడంతో విలాసవంతమైన భారతీయులు న్యూయార్క్, మయామి, లండన్, దుబాయ్, లిస్బన్‌ దేశాలలో లగ్జరీ అపార్ట్‌మెంట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement