గరిష్ఠాలను చేరిన జీఎస్టీ వసూళ్లు.. 2017 నుంచి ఇదే టాప్‌! | GST collections soared to a new peak of Rs 2.10 lakh crore in April | Sakshi
Sakshi News home page

గరిష్ఠాలను చేరిన జీఎస్టీ వసూళ్లు.. 2017 నుంచి ఇదే టాప్‌!

May 1 2024 3:07 PM | Updated on May 1 2024 3:07 PM

GST collections soared to a new peak of Rs 2.10 lakh crore in April

భారతదేశ జీఎస్టీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా వసూళ్లు నమోదయ్యాయి. ఏప్రిల్‌ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ కలెక్షన్లు రూ.2.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు అత్యధికంగా 2023 ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ఏడాది ప్రాతిపదికన ఈ వసూళ్లలో 12.4 శాతం వృద్ధి నమోదైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

2024 మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.78 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నెలవారీగా 13.4 శాతం వృద్ధిచెంది ఏప్రిల్‌లో అత్యధికంగా జీఎస్టీ రూ.2.10 లక్షలకోట్లకు చేరింది. రిఫండ్‌లను లెక్కించిన తర్వాత ఏప్రిల్ 2024లో నికర జీఎస్టీ ఆదాయం రూ.1.92 లక్షల కోట్లుగా ఉంటుంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 17.1% వృద్ధి నమోదైంది.

2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం నెలకు సగటున రూ.1.8 లక్షల కోట్లకు చేరుతుందని సీబీడీటీ కస్టమ్స్ ఛైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2022-23లో నెలవారీగా సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.51 లక్షల కోట్లుగా నమోదైంది. 2023-24లో సగటును రూ.1.68 లక్షల కోట్లకు చేరింది. 2017 జులైలో జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చాక ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌నెలలో అత్యధిక వసూళ్లు రికార్డవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement