జూన్లో రూ. 1.95 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా సరఫరా పెరగడంలాంటి సానుకూల అంశాల నేపథ్యంలో జూన్లో వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) స్థూల వసూళ్లు రూ. 1.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది జూలోలో నమోదైన రూ. 1.71 లక్షల కోట్లతో పోలిస్తే ఇది సుమారు 14% అధికం. ఈ ఏడాది మే నెలలో స్థూల వసూళ్లు రూ. 1.94 లక్షల కోట్లు. కేంద్రం విడుదల చేసిన డేటా ప్రకారం దేశీయ లావాదేవీలపై స్థూల కలెక్షన్ 6.5% పెరిగి రూ. 1.35 లక్షల కోట్లకు చేరింది.
ఇందులో కేంద్ర, రాష్ట్ర, సమీకృత జీఎస్టీ వసూళ్లు వరుసగా రూ. 37,376 కోట్లు, రూ. 45,116 కోట్లు, రూ. 52,282 కోట్లుగా ఉన్నాయి. దిగుమతులపై జీఎస్టీ ఆదాయం 34.6% ఎగిసి రూ. 60,038 కోట్లుగా నమోదైంది. మొత్తం రిఫండ్లు 29% పెరిగి రూ. 32,436 కోట్లుగా ఉంది. రిఫండ్లు పోగా నికరంగా వసూళ్లు 11.2% పెరిగి రూ. 1.62 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఇటీవలి గణాంకాలు చూస్తే కలెక్షన్లు మధ్యమధ్యలో ఒక్కసారిగా పెరగడం కాకుండా, నెమ్మదిగా ఒక స్థాయిలో స్థిరపడుతున్నట్లుగా కనిపిస్తోందని ఏకేఎం గ్లోబల్ లీడ్ (ఇన్డైరెక్ట్ ట్యాక్స్) ఇకేష్ నాగ్పాల్ తెలిపారు. పశి్చమాసియా ఉద్రిక్తతలతో ఆర్థిక పరిస్థితులపై ప్రభావాలు పడుతున్నా జీఎస్టీ నెలవారీ వసూళ్లు క్రమంగా రూ. 2 లక్షల కోట్ల మార్కుకి చేరువవుతున్నాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఎంఎస్ మణి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల జీఎస్టీ వసూళ్లు 8.4% పెరిగి రూ. 6.32 లక్షల కోట్లకు చేరాయి.


