
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) వర్గీకరించడానికి సంబంధించి పెట్టుబడులు, టర్నోవరు ప్రమాణాల్లో గణనీయంగా మార్పులు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం రూ. 2.5 కోట్ల వరకు పెట్టుబడులున్న సంస్థలను సూక్ష్మ సంస్థలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 1 కోటిగా ఉంది. అలాగే వీటి టర్నోవరు పరిమాణాన్ని రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు సవరించారు.
ఇక చిన్న సంస్థల హోదాకు సంబంధించి పెట్టుబడుల పరిమాణాన్ని రూ. 10 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు, టర్నోవరు పరిమితిని రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పెంచారు. రూ. 125 కోట్ల వరకు పెట్టుబడులు, రూ. 500 కోట్ల వరకు టర్నోవరు ఉన్న సంస్థలను మధ్య తరహా సంస్థలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం వీటి పెట్టుబడుల పరిమితి రూ. 50 కోట్లుగా ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఎంఎస్ఎంఈల వర్గీకరణకు సంబంధించి కొత్త ప్రమాణాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. పెట్టుబడులు, టర్నోవరు పరిమితులను వరుసగా రెండున్నర రెట్లు, రెండు రెట్లు పెంచేలా బడ్జెట్లో ప్రతిపాదించారు.