
ఈ సంవత్సరం జీతాల పెంపుపై గూగుల్ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని, ఇటీవల జరిగిన అన్ని వర్గాల సమావేశంలో వారు ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేసినట్లు బిజినెస్ ఇన్సైడర్ వెల్లడించింది. కంపెనీ బలమైన ఆర్థిక పురోగతిని నమోదు చేసినప్పటికీ.. జీతాల పెరుగుదల మాత్రం స్వల్పంగానే ఉందని పేర్కొన్నారు.
మంగళవారం (మార్చి 25) కంపెనీలో జరిగిన ఒక సమావేశంలో జీతాల పెంపు విషయం చర్చకు దారితీసింది. ఇందులో చాలామంది తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై కంపెనీ గ్లోబల్ కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ వైస్ ప్రెసిడెంట్ 'జాన్ కేసీ' స్పందిస్తూ.. 2025లో 80 శాతం కంటే ఎక్కువ మంది సిబ్బందికి వేతనాలు గత సంవత్సరంతో పోలిస్తే పెరిగాయని అన్నారు.
నాన్-టెక్నికల్ విభాగంతో పాటు కొన్ని విభాగాల్లోని వారు మాత్రమే తక్కువ పెంపును పొందినట్లు స్పష్టం చేశారు. తక్కువ పెంపును పొందిన ఉద్యోగులకు.. మరింత మెరుగైన వేతనం అందించాలని కంపెనీ యోచిస్తున్నట్లు జాన్ కేసీ వెల్లడించారు. ఈ పెంపు మంచి పనితీరును కనపరిచినవారిని ప్రోత్సహించేలా ఉంటుందని అన్నారు.
ఇదీ చదవండి: ఏప్రిల్లో బ్యాంకులు పనిచేసేది 15 రోజులే!.. ఎందుకంటే?