భారతదేశంలో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దేశంలోని ఒక ప్రముఖ థర్డ్ పార్టీ డేటా సెంటర్లో హఠాత్తుగా సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా.. దేశవ్యాప్తంగా గూగుల్ క్లౌడ్ నెట్వర్క్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ ‘గూగుల్ క్లౌడ్’ అధికారికంగా ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సాంకేతిక సిబ్బంది నెట్వర్కింగ్ పరికరాలను అత్యవసరంగా మూసివేయడం (Emergency Shutdown) వల్ల ఈ అంతరాయం తలెత్తినట్లు కంపెనీ వెల్లడించింది.
మెట్రో నగరాలపై ప్రభావం
డేటా సెంటర్లో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు సదుపాయంలో అత్యవసర విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీనివల్ల ఢిల్లీలోని ‘లోకల్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్’ పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఫలితంగా సదరు మెట్రోపాలిటన్ ప్రాంతం అంతటా నెట్వర్క్ సామర్థ్యం ఒక్కసారిగా పడిపోయింది. ఈ సాంకేతిక లోపం కారణంగా దేశంలోని ప్రధాన ఐటీ హబ్లైన కొన్ని నగరాల్లో నెట్వర్క్ ట్రాఫిక్కు ఆటంకం ఏర్పడిందని కంపెనీ తన స్టేటస్ పేజీలో స్పష్టం చేసింది. ఢిల్లీ (ఎన్సీఆర్ ప్రాంతం), ముంబై, చెన్నై, వాటి సమీప ప్రాంతాలు దీనివల్ల ప్రభావితమైనట్లు తెలిపింది.
అయితే, ఈ అగ్నిప్రమాదం అసలు ఎప్పుడు సంభవించింది? దీనివల్ల ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది? లేదా ఎవరికైనా గాయాలయ్యాయా? అనే పూర్తి వివరాలను గూగుల్ క్లౌడ్ అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.
వ్యాపార రంగంపై ప్రభావం
ప్రస్తుత డిజిటల్ యుగంలో క్లౌడ్ సేవలపైనే మెజారిటీ కార్పొరేట్ కంపెనీలు ఆధారపడి ఉన్నాయి. గూగుల్ క్లౌడ్ వంటి దిగ్గజ నెట్వర్క్ నిలిచిపోవడంతో దీని ప్రభావం గొలుసుకట్టు తరహాలో వ్యాపారాలు, వినియోగదారులపై పడింది. దేశంలోని పలు ప్రముఖ వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లు, కంపెనీల అంతర్గత సర్వర్ వ్యవస్థలు మందగించాయి.
క్లౌడ్ మార్కెట్లో గూగుల్ ప్రాధాన్యత
ప్రపంచంలోనే అతిపెద్ద క్లౌడ్ సేవల అందించే కంపెనీల్లో గూగుల్ క్లౌడ్ ప్రధానమైంది. అంతర్జాతీయంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి దిగ్గజాలతో గూగుల్ క్లౌడ్ పోటీపడుతోంది. ముఖ్యంగా భారీ డేటా వాల్యూమ్లను ప్రాసెస్ చేయడానికి, అధునాతన కృత్రిమ మేధ పరికరాలను రన్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంపెనీలు గూగుల్ క్లౌడ్ను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం ఐటీ రంగాన్ని కాసేపు కుదిపేసింది.
ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో!


