భారీ వృద్ధిపై గోద్రేజ్‌ క్యాపిటల్‌ కన్ను | Godrej Capital aims for RS 50000 crore BY 2028 | Sakshi
Sakshi News home page

భారీ వృద్ధిపై గోద్రేజ్‌ క్యాపిటల్‌ కన్ను

Nov 6 2023 6:31 AM | Updated on Nov 6 2023 6:31 AM

Godrej Capital aims for RS 50000 crore BY 2028 - Sakshi

చెన్నై: బ్యాంకింగేతర ఆర్థిక సేవల్లోని గోద్రేజ్‌ క్యాపిటల్‌ తన రుణ పుస్తకాన్ని భారీగా పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉంది. 2028 నాటికి రుణ పుస్తకాన్ని రూ.50,000 కోట్లకు చేర్చే దిశగా పనిచేస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో మనీష్‌ షా ప్రకటించారు. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ నూరు శాతం అనుబంధ సంస్థగా గోద్రేజ్‌ క్యాపిటల్‌ 2020లో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్రేక్‌ఈవెన్‌ సాధించినట్టు (లాభ, నష్టాల్లేని స్థితి) మనీషా తెలిపారు.

2028 నాటికి రూ.50,000 కోట్ల రుణ ఆస్తులను చేరుకునేందుకు వీలుగా తమకు అదనంగా రూ.4,000 కోట్ల నిధులు అవసరం అవుతాయని చెప్పారు. ‘‘2020 అక్టోబర్‌లో లైసెన్స్‌ లభించింది. 2028 నాటికి ఏయూఎంను రూ.50,000 కోట్లకు చేర్చాలని అనుకుంటున్నాం. 2024 మార్చి నాటికి ఏయూఎం రూ.10,000 కోట్లను చేరుతుంది. హోల్డింగ్‌ కంపెనీ (గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌) నుంచి రూ.2,000 కోట్లు అందుకున్నాం. రూ.50,000 కోట్ల పుస్తకాన్ని చేరుకునేందుకు ఏటా రూ.1,000 కోట్ల చొప్పున నిధులు అవసరం అవుతాయి’’అని చెన్నైలో మీడియా ప్రతినిధులకు షా తెలిపారు.

2026 నాటికి రూ.30,000 కోట్ల ఏయూఎంకు చేరుకుంటామన్నారు. ఎంఎస్‌ఎంఈ, గృహ రుణాలు తమ ప్రాధాన్య విభాగాలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.7,700 కోట్ల రుణాల్లో ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చినవి రూ.4,000 కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. మిగిలిన మొత్తం గృహ రుణాలుగా పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ రుణ ఆస్తుల్లో రూ.5–50 కోట్ల మధ్య ఆదాయం కలిగినవి ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఎంఎస్‌ఎంఈలు తమ వ్యాపారాన్ని సమగ్రంగా వృద్ధి చేసుకునేందుకు వీలుగా త్వరలోనే ‘నిర్మన్‌’ పేరుతో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్టు షా ప్రకటించారు. నిర్మన్‌ సేవల కోసం అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లింగ్, ఆన్‌ష్యూరిటీ, జోల్‌విట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు చెప్పారు. తద్వారా ఎంఎస్‌ఎంఈలకు ఆన్‌లైన్‌ మార్కెట్‌ అవకాశాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement