
ఏఐ(కృత్రిమ మేధ) గాడ్ఫాదర్గా పేరొందిన జెఫ్రీ హింటన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల టెక్ పరిశ్రమ అనుసరిస్తున్న విధానంపై విమర్శలు చేశారు. నైతిక దూరదృష్టి లేకపోవడం, నియంత్రణలేని కృత్రిమ మేధ అభివృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. హింటన్ ఇటీవల ఫార్చ్యూన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీల సాంకేతిక ఆధిపత్యం కొనసాగుతున్న తరుణంలో దీర్ఘకాలిక శ్రేయస్సు మసకబారుతుందని చెప్పారు.
స్వల్పకాలిక లాభాలే కీలకం
సాంకేతిక పరిజ్ఞానానికి శక్తినిచ్చే ఏఐ అల్గారిథమ్లను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన హింటన్, ప్రస్తుతం టెక్ కంపెనీలు మరింత శక్తివంతమైన ఏఐ మోడళ్లను నిర్మించడానికి పోటీ పడుతున్నాయని తెలిపారు. ఆ సమయంలో భవిష్యత్తులో నెలకొనే విస్తృత ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నైతికంగా ఏఐ అభివృద్ధి పట్ల నిబద్ధత కంటే ప్రధానంగా పోటీ ఒత్తిళ్లు, స్వల్పకాలిక లాభాలే కీలకం అవుతున్నట్లు చెప్పారు.
మానవ విలువలకు అనుగుణంగా ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ వ్యవస్థలను మోహరిస్తే వినాశకరమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఏఐ వల్ల తప్పుడు సమాచారం, ఉద్యోగాలు కోల్పోవడం, గోప్యతా ఉల్లంఘనలు.. వంటి ప్రమాదాల కన్నా మానవులను డామినేట్ చేసే వ్యవస్థల వల్ల మరింత నష్టం కలుగుతుందన్నారు.
నైతిక ఫ్రేమ్వర్క్..
కృత్రిమ మేధ అభివృద్ధిలో బలమైన నైతిక చట్రం(మోరల్ ఫ్రేమ్వర్క్) లేదని హింటన్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాలను పెంచడానికి, వినియోగదారుల డేటాను మానిటైజ్ చేయడానికి బిలియన్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నప్పటికీ కొన్ని కంపెనీలు మాత్రం ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ) అస్తిత్వ ప్రమాదాలపై దృష్టి పెడుతున్నాయని పేర్కొన్నారు. ఏదేమైనా కృత్రిమ మేధ అభివృద్ధికి నైతిక ప్రమాణాలు చాలా అవసరం అని చెప్పారు. నిర్దిష్ట ఫ్రేమ్వర్క్లను తయారు చేయడానికి ప్రపంచ సహకారం కావాలని పిలుపునిచ్చారు. వ్యవస్థల మధ్య ఒప్పందాలు, పర్యవేక్షణ, నైతిక ప్రమాణాలు అవసరమన్నారు. ఏఐ పరిశోధకులు, భద్రత, పారదర్శకత, దీర్ఘకాలిక ఆలోచనలకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.
ఇదీ చదవండి: బైక్ ట్యాక్సీ సేవలు పునరుద్ధరణ