
సబ్సిడరీల్లో వాటాల విక్రయంతో రాబడులు
ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచన
న్యూఢిల్లీ: సబ్సిడరీల కార్యకలాపాలను మరింత విస్తరించి వాటిని స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ చేయడంపై దృష్టి సారించాలని ప్రభుత్వరంగ బ్యాంక్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. తద్వారా మంచి రాబడులు అందుకోవచ్చని పేర్కొంది. ప్రభుత్వరంగ బ్యాంక్ల (పీఎస్బీలు)కు సంబంధించి సుమారు 15 సబ్సిడరీలు, జాయింట్ వెంచర్లు మధ్య కాలం నుంచి దీర్ఘకాలలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) లేదా పెట్టుబడుల ఉపసంహరణకు రానున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
సబ్సిడరీలు లేదా జాయింట్ వెంచర్లకు సంబంధించి అవసరమైతే కార్యకలాపాల విస్తరణపై పీఎస్బీలు పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక శాఖ సూచిస్తూ.. సరైన సమయంలో వాటాల విక్రయం ద్వారా లాభాలను సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలని పేర్కొంది. సబ్సిడరీలకు సంబంధించి పరిపాలన, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను మెరుగుపరుచుకోవాలని, గొప్ప నిర్వహణ సామ ర్థ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఆ దిశగా ఇప్పటికే చర్యలు..
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అగ్రగామి అయిన ఎస్బీఐ నుంచి భవిష్యత్తులో అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (మ్యూచువల్ ఫండ్స్), జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ పేమెంట్ సర్వీసెస్ ఐపీవోకు వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.509 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్లో ఎస్బీఐకి 68.99 వాటా ఉంది. ఎస్బీఐ పేమెంట్ సర్వీసెస్లో ఎస్బీఐకి 74 శాతం వాటా ఉంటే, హిటాచీ పేమెంట్ సర్విసెస్కు మిగిలిన 26 శాతం వాటా ఉంది.
ఎస్బీఐ పేమెంట్ సర్విసెస్ కింద 33.10 లక్షల మంది మర్చంట్ టచ్ పాయింట్లు నమోదై ఉన్నాయి. ఇందులో 13.67 లక్షల పీవోస్ మెషిన్లు కూడా ఉన్నాయి. మరోవైపు కెనరా బ్యాంక్ తన మ్యూచువల్ ఫండ్స్ వ్యాపార జాయింట్ వెంచర్ అయిన కెనరా రొబెకో ఏఎంసీ లిస్టింగ్కు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. బీమా జాయింట్ వెంచర్ అయిన కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ను కూడా లిస్ట్ చేసే ప్రణాళికతో ఉంది. బీమా జేవీలో 14.5 శాతం వాటా విక్రయానికి అనుకూలంగా కెనరా బ్యాంక్ బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం గమనార్హం.