పాల కల్తీని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల విక్రయాలపై కఠినమైన ఉత్తర్వులను జారీ చేసింది. జులై 3 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాల వ్యాపారాలకు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో సింథటిక్ పాలు, పాల కల్తీ, రవాణాలో జరుగుతున్న పలు ఉల్లంఘనలను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకుంది. కల్తీదారుల పట్ల ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తోందని ఎఫ్డీఏ హెచ్చరించింది.
కొత్త మార్గదర్శకాలు..
పాశ్చరైజ్డ్ పాలను కేవలం సీల్ చేసిన, సరిగ్గా లేబుల్ చేయబడిన, ట్యాంపర్-స్పష్టమైన (ఎవరూ మార్చడానికి వీలులేని) ప్యాకేజింగ్లో మాత్రమే విక్రయించాలి.
పాలు ఎక్కడి నుంచి సేకరించారు? ఎవరికి సరఫరా చేశారు? అనే పూర్తి రికార్డులను నిర్వహించడం తప్పనిసరి. డైరీ ఫార్మ్ (వ్యవసాయ స్థాయి) నుంచి చివరి వినియోగదారుడికి అమ్మే వరకు ప్రతి దశను ట్రాక్ చేసేలా రికార్డులు ఉండాలి.
పాలను నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి కేవలం ఫుడ్-గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లను మాత్రమే ఉపయోగించాలి. ప్లాస్టిక్ లేదా ఇతర నాణ్యత లేని పాత్రల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు.
పాలు, పాల ఉత్పత్తుల నిర్వహణ, పంపిణీ ప్రక్రియల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే వార్షిక వైద్య ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ముడి పాలపై ప్రత్యేక హెచ్చరిక
మార్కెట్లో వినియోగదారులకు నేరుగా విక్రయించే ముడి పాలు ప్యాకెట్లు లేదా కంటైనర్లపై ‘ఉపయోగించడానికి ముందు తప్పనిసరిగా వేడి చేయండి’ అనే హెచ్చరికను ప్రముఖంగా ప్రదర్శించాలని ఎఫ్డీఏ ఆదేశించింది.
రూ.10 లక్షల వరకు జరిమానా!
ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించి పాల కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. నిబంధనల ప్రకారం, కల్తీకి పాల్పడిన వారికి రూ.10 లక్షల వరకు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి!


