
ఆర్థిక, ధరల గణాంకాలు కీలకం
రేట్ల కోత ఎఫెక్ట్ కొనసాగే చాన్స్
విదేశీ గణాంకాలకూ ప్రాధాన్యం
దేశీ స్టాక్స్పై నిపుణుల అంచనా
గత వారం ఆర్థికవేత్తలను ఆశ్చర్యపరుస్తూ ఆర్బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.5 శాతం కోత పెట్టింది. అంతేకాకుండా బ్యాంకుల నగదు లభ్యతను పెంచుతూ సీఆర్ఆర్ను 1 శాతం తగ్గించింది. దీంతో వారాంతాన మార్కెట్లకు జోష్ వచ్చింది. పాలసీ నిర్ణయాల ప్రభావానికితోడు పలు ఇతర అంశాలు ఈ వారం దేశీ స్టాక్మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..
బ్యాంకుల లిక్విడిటీ పెంపు, వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో జోరందుకున్నాయి. ఈ ప్రభావం ఇకపైన సైతం కనిపించే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. రియల్టీ, బ్యాంకింగ్, ఆటో, కన్జూమర్ రంగాలలో యాక్టివిటీ కొనసాగవచ్చని పేర్కొన్నారు. అయితే రుతుపవనాల కదలికలు, దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు, యూఎస్, భారత్ వాణిజ్య చర్చలు తదితర పలు ఇతర అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మే చివర్లోనే ఆశలు రేపిన రుతుపవనాలు ప్రస్తుతం మందగించాయి. ఇకపై వీటి కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా వర్షాల ఆధారంగా పంటల సాగు, వ్యవసాయ పురోగతి నమోదుకానున్న సంగతి తెలిసిందే. ఇవి గ్రామీణ ప్రాంతాలలో డిమాండును ప్రభావితం చేయగలవని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు.
రిటైల్ ధరలు
గత నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు గురువారం(12న) తెలియనున్నాయి. వార్షిక సీపీఐ 2025 ఏప్రిల్లో 3.16 శాతంగా నమోదైంది. 2019 జులై తదుపరి ఇది కనిష్టంకాగా.. 2025 మార్చిలో 3.34 శాతానికి చేరింది. ఈ బాటలో మే నెలకు వాణిజ్య గణాంకాలు 13న వెల్లడికానున్నాయి. 2025 ఏప్రిల్లో దేశీ వాణిజ్య లోటు 26.42 బిలియన్ డాలర్లను తాకింది.
ఏప్రిల్లో దిగుమతులు 64.91 బిలియన్ డాలర్లకు చేరగా.. ఎగుమతులు 38.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2024 ఏప్రిల్లో నమోదైన 19.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే వాణిజ్య లోటు భారీగా పెరిగింది. యూఎస్, భారత్ మధ్య తొలి దశ వాణిజ్య చర్చలపై నిర్ణయాలు వెలువడే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమ్కా పేర్కొన్నారు. ఆర్బీఐ రేట్ల కోత, నిలకడైన జీడీపీ ఔట్లుక్ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు.
విదేశీ గణాంకాలు
నేడు(9న) మే నెలకు చైనా వాణిజ్య, ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్లో చైనా వినియోగ ధరలు 0.1 శాతానికి చేరగా.. వాణిజ్య మిగులు 96.18 బిలియన్ డాలర్లను తాకింది. 2024 ఏప్రిల్లో నమోదైన 72 బిలియన్ డాలర్లతో పోలిస్తే చైనా వాణిజ్య మిగులు భారీగా ఎగసింది. ఇక మే నెలకు యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు 12న విడుదలకానున్నాయి. 2025 ఏప్రిల్లో 2.3 శాతంగా నమోదైంది. 2021 ఫిబ్రవరి తదుపరి ఇది కనిష్టంకాగా.. పీపీఐ ఏప్రిల్లో 0.5 శాతంగా నమోదైంది. ఇవికాకుండా గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో పరిస్థితులు, యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ ముడిచమురు ధరలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు స్టాక్ నిపుణులు వివరించారు.
గత వారమిలా
అంచనాలను మించుతూ ఆర్బీఐ.. రెపో రేటులో 0.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)లో 1 శాతం చొప్పున కోత పెట్టడంతో గత వారం(2–6) దేశీ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 738 పాయింట్లు(0.9 శాతం) పెరిగి 82,189 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 252 పాయింట్లు(1 శాతం) పుంజుకుని 25,003 వద్ద ముగిసింది. వెరసి ప్రధాన ఇండెక్సులు సాంకేతికంగా కీలకమైన 82,000, 25,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించి స్థిరపడ్డాయి. ఈ బాటలో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 2 శాతం స్థాయిలో ఎగశాయి.
సాంకేతికంగా
సాంకేతికంగా చూస్తే ఈ వారం నిఫ్టీ 25,150 వద్ద అవరోధాన్ని(రెసిస్టెన్స్) ఎదుర్కొనే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ స్థాయిని అధిగమిస్తే ఇండెక్స్ 25,350వరకూ బలపడవచ్చని అంచనా వేశారు. అయితే లాభాల స్వీకరణ కారణంగా అమ్మకాలు ఊపందుకుంటే 24,850కు వెనకడుగు వేయవచ్చని తెలియజేశారు. ఈ స్థాయిలో నిఫ్టీకి సాంకేతికంగా మద్దతు(సపోర్ట్) లభించే వీలున్నట్లు విశ్లేషించారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్