భారతదేశం ఇంధన స్వాలంబన వైపు వేగంగా అడుగులు వేస్తోంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) ప్రకారం, 2013-14లో 1.53% ఉన్న ఇథనాల్ బ్లెండింగ్ 2025-26 నాటికి 20% (E20)కి చేరింది. దీనివల్ల రూ.1.97 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడంతోపాటు రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి.
అయితే, హారాల్డ్ లాస్వెల్ (1956), చార్లెస్ లిండ్బ్లోమ్ (1959) సిద్ధాంతాలు(ప్రభుత్వం ఎలా నిర్ణయాలు తీసుకోవాలో చెప్పే సిద్ధాంతాలు) పేర్కొన్నట్లు.. విధాన రూపకల్పనలో కేవలం లక్ష్య సాధనే కాకుండా, అమలులో ఎదురయ్యే అనుభవాల ఆధారంగా సర్దుబాట్లు చేసుకోవడం చాలా ముఖ్యం.
ప్రధాన సవాళ్లు.. వినియోగదారుల భారం
పాత వాహనాల్లో ఈ20 అనుకూలతపై స్పష్టమైన అంచనా లేదని, వీటిలో మైలేజ్ 3–5% తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది. బంకుల్లో పాత ఇంధనం దొరక్కపోవడంతో వినియోగదారులు మైలేజ్ కోతను, విడిభాగాల అరుగుదల వ్యయాన్ని తప్పనిసరిగా భరించాల్సి వస్తోంది. ఇథనాల్ శాతాన్ని పెంచడానికే ప్రాధాన్యమివ్వడంతో వాహనదారుల ప్రయోజనాలు, వాహనాల సన్నద్ధత ప్రాధాన్యం కోల్పోయాయి.
అంతర్జాతీయ పాఠాలు
బ్రిటన్ E10ను ప్రవేశపెట్టినప్పుడు పాత వాహనాల కోసం E5ని ‘ప్రొటెక్షన్ గ్రేడ్’గా కొనసాగించి వాహన అనుకూలతను సరిచూసుకునే సదుపాయం కల్పించింది. వినియోగదారులు లేవనెత్తుతున్న మైలేజ్, వారంటీ సమస్యలను అపోహలుగా కొట్టిపారేయకుండా ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కేవలం ఇంధనంలో ఇథనాల్ కలిపే శాతాన్నే కాకుండా నీటి వినియోగం, ఇతర ఉద్గారాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అనుభవాల ఆధారంగా విధానాన్ని సరళంగా సవరించుకోవడమే నిజమైన పరిపాలనా సామర్థ్యమని చెబుతున్నారు.
ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా..


