ఈ-రిక్షాల బ్యాటరీల హ్యాకింగ్‌ కలకలం | E-Rickshaw Battery Hacking Chaos India Bans Chinese Apps Amid Cyber Threats | Sakshi
Sakshi News home page

ఈ-రిక్షాల బ్యాటరీల హ్యాకింగ్‌ కలకలం

Jul 4 2026 8:09 AM | Updated on Jul 4 2026 9:03 AM

E-Rickshaw Battery Hacking Chaos India Bans Chinese Apps Amid Cyber Threats

దేశవ్యాప్తంగా సామాన్యుడి రవాణాకు అనువుగా ఉన్న ఈ-రిక్షాలను టార్గెట్ చేస్తూ సాగుతున్న డిజిటల్ దోపిడీపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తున్న ఈ-రిక్షాల బ్యాటరీలను రిమోట్ విధానంలో నిలిపివేస్తూ (షట్‌డౌన్) కొందరు కేటుగాళ్లు డ్రైవర్లను బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఉదంతాలు వెలుగుచూడటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు కారణమవుతున్న పలు ‘బ్యాటరీ మేనేజ్‌మెంట్ యాప్‌లను’ వెంటనే బ్లాక్ చేయాలంటూ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.

చైనా యాప్‌ల ద్వారా సైబర్ ముఠాల దాడులు

ఈ వివాదంలో ప్రధానంగా చైనా సంస్థలు అభివృద్ధి చేసిన యాప్‌లు ఉన్నట్లు కేంద్ర ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వీటిలో షెంజెన్ గ్రీన‌ర్జీ టెక్నాలజీ, షెంజెన్ రుయిచువాంగ్ లినెంగ్ టెక్నాలజీ, డేలీ బీఎమ్ఎస్.. వంటి యాప్‌లు ఉన్నాయి. సాధారణంగా లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ల్లో ఛార్జ్, వోల్టేజ్, ఉష్ణోగ్రత, సెల్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ‘బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్’ (బీఎంఎస్‌) ఉంటాయి. అయితే, వీటికి సరైన పాస్‌వర్డ్ లేదా పిన్ రక్షణ లేకపోవడంతో దుండగులు బ్లూటూత్ లేదా స్థానిక కనెక్టివిటీ ద్వారా వీటిని హ్యాక్ చేస్తున్నారు. ఇందుకు ఇంటర్నెట్ కూడా అవసరం లేకపోవడం గమనార్హం.

వైరల్ వీడియోలతో వెలుగులోకి..

గత వారం రోజులుగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. నడుస్తున్న ఈ-రిక్షాలు అకస్మాత్తుగా రోడ్డు మధ్యలోనే ఆగిపోవడం, ఆ వెంటనే కొందరు వ్యక్తులు వచ్చి డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం ఆ వీడియోల్లో కనిపించింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఇటువంటి ఘటనే కలకలం రేపింది. అక్కడి లోతి తిరాహా ప్రాంతంలో ఒక ఈ-రిక్షా ఆగిపోగా దాన్ని బాగుచేస్తానంటూ ఒక యువకుడు డ్రైవర్ నుంచి రూ.200 డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ యువకుడిని విచారించగా యాప్ ద్వారా బ్యాటరీని నిలిపివేసి ఆపై డబ్బులు గుంజే రాకెట్ నడుస్తున్నట్లు నీల్ గంగ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తరుణ్ కురిల్ ధ్రువీకరించారు.

నిబంధనల్లో లొసుగులే శాపమా?

ప్రస్తుతం మనదేశంలో ఈ-రిక్షాలను ‘L5M’ కేటగిరీ వాహనాలుగా పరిగణిస్తారు. ప్రముఖ తయారీదారులు వీటికి ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ’ (ఐసీఏటీ) నుంచి సర్టిఫికేషన్ పొందుతారు. అయితే, ఐసీఏటీ నిబంధనల ప్రకారం బ్యాటరీల ఎలక్ట్రికల్, మెకానికల్ సేఫ్టీని మాత్రమే పరీక్షిస్తారు. ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన ఏఐఎస్‌-189 వంటి ప్రమాణాలలో సైబర్ సెక్యూరిటీ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ఈ-రిక్షాలకు తప్పనిసరి చేయకపోవడమే ఈ సైబర్ దాడులకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి యాప్‌లను నిషేధించినప్పటికీ పాస్‌వర్డ్ లేని ఈ బ్యాటరీల భద్రతా లోపాలను పూర్తిస్థాయిలో సరిదిద్దడానికి మరిన్ని సాంకేతిక మార్పులు అవసరమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement