డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లపై సమస్యాత్మక ప్రకటనలు | Digital Platforms Lead in Problematic Ads | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లపై సమస్యాత్మక ప్రకటనలు

Jun 1 2025 4:37 AM | Updated on Jun 1 2025 8:39 AM

Digital Platforms Lead in Problematic Ads

బెట్టింగ్, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల ఉల్లంఘనలు 

ప్రకటనల ప్రమాణాల మండలి ఆక్షేపణ

ముంబై: సమస్యాత్మక ప్రకటనలకు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు ప్రధాన మాధ్యమంగా మారాయని భారతీయ ప్రకటనల ప్రమాణాల మండలి (ఏఎస్‌సీఐ) తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) మొత్తం 9,599 ప్రకటనల ఫిర్యాదులు ఏఎస్‌సీఐ దృష్టికి రాగా.. ఇందులో 7,199 ప్రకటనల ఉల్లంఘనలను గుర్తించింది. వీటిల్లో 95 శాతం ప్రకటనలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లపై ప్రసారమైనవేనని ఏఎస్‌సీఐ ప్రకటించింది. 

వీటిల్లోనూ మూడింట రెండొంతులు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రాయోజిత ప్రకటనలు కాగా, 32 శాతం ప్రకటనలు కంపెనీల సొంత వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా అకౌంట్లలో వచ్చినవిగా తెలిపింది. అత్యధికంగా 79 శాతం సమస్యాత్మక ప్రకటనలకు మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ మాతృ సంస్థ) కేంద్రంగా ఉన్నట్టు పేర్కొంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో సమస్యాత్మక ప్రకటనల్లో 43.52 శాతం ఆఫ్‌షోర్‌ బెట్టింగ్‌కు సంబంధించి ఉంటే, 25 శాతం రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సంబంధించినవిగా ఏఎస్‌సీఐ తెలిపింది.

 3,347 ప్రకటనలు చట్ట నిబంధనలను ఉల్లఘించేవిగా ఉండడంతో వాటిపై చర్యలకు ప్రభుత్వానికి నివేదించినట్టు వెల్లడించింది. డిజిటల్‌ మీడియా పెద్ద సవాళ్లను తీసుకొస్తోందని.. భాగస్వాములు అందరూ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కలసికట్టుగా చర్యలు తీసుకోవాల్సి ఉందని ఏఎస్‌సీఐ అభిప్రాయపడింది. టీవీ, పత్రికల్లో ఇచ్చే ప్రకటనలు ఒకే తీరులో ఉంటే.. ఆల్గోరిథమ్‌ ఆధారితంగా నడిచే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లపై మాత్రం విభిన్న యూజర్లకు విభిన్న ప్రకటనలు ప్రదర్శితం అవుతున్నాయని.. వీటిని పర్యవేక్షించడం క్లిష్టంగా మారినట్టు తెలిపింది. డిజిటల్‌ వేదికలపై సమస్యాత్మక ప్రకటనలను గుర్తించేందుకు వీలుగా.. ఫ్రెంచ్‌ సంస్థతో ఏఎస్‌సీఐ జట్టు కట్టడంతోపాటు.. టెక్నాలజీపై పెట్టుబడులను పెంచడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement