రూ.70,000 కోట్ల బిడ్‌ను తిరస్కరించిన రక్షణ శాఖ | Defence Ministry Rejected Larsen & Toubro Bid For The Rs 70,000 Crore Submarine Project, Check Out More Details | Sakshi
Sakshi News home page

రూ.70,000 కోట్ల బిడ్‌ను తిరస్కరించిన రక్షణ శాఖ

Jan 23 2025 3:16 PM | Updated on Jan 23 2025 4:13 PM

Defence Ministry rejected Larsen & Toubro bid for the Rs 70,000 crore submarine project

భారత్‌ ప్రతిష్టాత్మంగా చేపట్టిన ప్రాజెక్టు 75ఇండియా(P75I)లో భాగంగా రూ.70,000 కోట్ల విలువైన జలాంతర్గాముల తయారీ కోసం లార్సెన్ అండ్ టుబ్రో (L&T) వేసిన బిడ్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఈ నిర్ణయంతో మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (MDL) మాత్రమే ఆరు తదుపరి తరం జలాంతర్గాములను నిర్మించే రేసులో నిలిచింది.

ప్రాజెక్ట్ 75 ఇండియా

భారత నౌకాదళం ప్రాజెక్ట్ 75ఇండియా(పీ75ఐ) మూడు వారాల పాటు నీటి అడుగున ఉండగల సామర్థ్యం కలిగిన ఆరు అధునాతన జలాంతర్గాములను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెరుగుతున్న ప్రాంతీయ బెదిరింపుల మధ్య నౌకా సామర్థ్యాలను ఆధునీకరించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.

ఎల్ అండ్ టీ బిడ్ భారత నౌకాదళ అవసరాలకు అనుగుణంగా లేదని రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తించింది. స్పానిష్ కంపెనీ నవంతియా భాగస్వామ్యంతో ఎల్ అండ్ టీ స్పెయిన్‌లో కీలకమైన ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) వ్యవస్థ పనితీరును ప్రదర్శించింది. అయినా ప్రభుత్వం కంపెనీ బిడ్‌ను తిరస్కరించడం గమనార్హం. ఏదేమైనా, భారత నౌకాదళం వ్యవస్థను, దాని అంచనాలు, డిమాండ్లను అందుకోవడంలో ఎల్ అండ్ టీ విఫలమైంది.

పరిమిత పోటీపై ఆందోళన

ఎల్ అండ్ టీ అనర్హతతో ఎండీఎల్ ఇ‍ప్పటికే షార్ట్ లిస్ట్ చేసిన ఒరిజినల్ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరర్స్(ఓఈఎం)ల్లో ఒకటైన నావల్ గ్రూప్ (ఫ్రాన్స్), థైసెన్ క్రుప్ మెరైన్ సిస్టమ్స్ (జర్మనీ), డేవూ షిప్ బిల్డింగ్ (దక్షిణ కొరియా), రోసోబోరో నెక్స్‌పోర్ట్‌(రష్యా)తో కలిసి పనిచేయనుంది. ఇంత ముఖ్యమైన ఒప్పందంలో పరిమిత పోటీపై ఆందోళనలను వస్తున్నాయి. రక్షణ రంగంలో, దేశీయంగా నౌకాదళ ఉత్పత్తుల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న ఎల్ అండ్ టీని మినహాయించడం భారత్ స్వావలంబనపై ప్రభావం చూపనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: పన్ను చెల్లింపుదారులతో సర్వే.. ఆసక్తికర అంశాలు

పీ75ఐ గురించి మరికొంత..

ప్రాజెక్ట్ 75 ఇండియా (పీ75ఐ) భారత నౌకాదళం ముఖ్యమైన ప్రాజెక్ట్‌. అత్యాధునిక ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) వ్యవస్థలతో కూడిన ఆరు అధునాతన డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాములను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఐపీ వ్యవస్థ జలాంతర్గాములు ఎక్కువ సేపు బయటకు రాకుండా ఉండడానికి వీలు కల్పిస్తుంది. వీటిని ఎక్కువ లోతుల్లోకి వెళ్లేలా రూపొందించనున్నారు. ఈ జలాంతర్గాముల్లో సమకాలీన పరికరాలు, ఆయుధాలు, సెన్సర్లు, ఆధునిక క్షిపణులు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement