సాక్షి, హైదరాబాద్: గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు, సీఎం రేవంత్ రెడ్డి (శుక్రవారం) కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ సహకారానికి తెలంగాణ ప్రభుత్వం తరుపున ధన్యవాదాలని పేర్కొన్నారు.మూసీ పునరుజ్జీవనలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కీలక మైలురాయిగా భావిస్తున్నామని... మూసీ పరివాహక ప్రాంతాన్ని సాంస్కృతిక ప్రజా వారసత్వ ఆస్తిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తేల్చిచెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్లోని బాపూఘాట్ (ఈసీ, మూసీ నదుల సంగమ ప్రాంతం) వద్ద 'గాంధీ సరోవర్' ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ వద్ద సుమారు 150 మీటర్ల ఎత్తులో మహాత్మా గాంధీ భారీ విగ్రహం, మ్యూజియం, లండన్ ఐ తరహా రాట్నం, సైక్లింగ్ ట్రాక్లు, బోటింగ్ సదుపాయంతో పాటు పలు పర్యాటక ఆకర్షణలు అభివృద్ధి చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన డిజైనింగ్, డీపీఆర్ ఇదివరకే సిద్ధమయ్యాయి.
తాజాగా పనుల నిర్వహణకు రక్షణ శాఖఅనుమతులు మంజూరు చేసింది. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోని 83.818 ఎకరాల రక్షణ శాఖ భూమిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భూమికి ఈ కీలకమైన క్లియరెన్స్ లభించడంతో బాపూఘాట్ వద్ద ప్రాజెక్టు నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయి.


