‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌’ | Sakshi
Sakshi News home page

‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌’

Published Fri, Apr 26 2024 7:18 PM

Deepinder Goyal Buys 5 Acre Land In Delhi For Rs 79 Crore

‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’.. ఈ మాటను తు.చ తప్పకుండా పాటిస్తారు సినీతారలు. అవకాశాలు అన్నప్పుడు, స్టార్‌డమ్‌ సంపాదించినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తారు. ఇప్పుడు ఈ కోవలోకే ప్రముఖ వ్యాపార వేత్తలు వచ్చి చేరుతున్నారు. వ్యాపారం బాగా జరిగినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తున్నారు. భవిష్యత్‌పై ఆర్ధిక భరోసా నిచ్చే రంగాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు.  

తాజాగా ప్రముఖ ఫుడ్‌ డెలివరీ దిగ్గజం జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ న్యూఢిల్లీలోని మెహ్రౌలీ అనే ప్రాంతంలో పక్క పక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో 5 ఎకరాల భూముని కొనుగోలు చేశారు. ఆ భూమి విలువ సుమారు రూ.79కోట్లు. వేర్వేరు యజమానుల నుంచి కొనుగోలు చేసిన ఆ భూమికి మొత్తం స్టాంప్‌ డ్యూటీ రూ.5.24 కోట్లు చెల్లించినట్లు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి అవగాహన ఉన్న సీఆర్‌ఈమ్యాటిక్స్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ తెలిపింది.  

గత ఏడాది మార్చి 28న తొలి సారి 2.5 ఎకరాల భూమిని Luxalon Building Private Limited నుంచి కొనుగోలు చేశారు. దాని విలువ రూ.29 కోట్లు కాగా.. స్టాంప్‌ డ్యూటీ కింద రూ.1.74 కోట్లు చెల్లించారు. రెండో సారి స్టెప్టెంబర్‌ 1, 2023న రవి కపూర్‌ అనే యజమాని నుంచి 2.53 ఎకరాల ల్యాండ్‌ను కొనుగోలు చేశారు. దీనికి రూ.50 వెచ్చించారు. స్టాంప్‌ డ్యూటీ కింద రూ.3.50 కోట్లు కట్టారు. 


పలు నివేదికల ప్రకారం.. రెండు ప్లాట్లు ఛతర్‌పూర్ ప్రాంతంలోని డేరా మండి అనే గ్రామంలో ఉన్నాయి. రెండు లావాదేవీల రిజిస్ట్రేషన్ హౌజ్ ఖాస్‌లో జరిగింది 

ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ మేక్‌మైట్రిప్ గ్రూప్ సీఈఓ రాజేష్ మాగో గురుగ్రామ్‌లోని డిఎల్‌ఎఫ్ మాగ్నోలియాస్‌లో 6,428 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 33 కోట్లకు కొనుగోలు చేశారు.  


జెన్‌పాక్ట్ సిహెచ్‌ఆర్‌ఓ పీయూష్ మెహతా అదే ప్రాపర్టీలో రూ.32.60 కోట్లతో 6,462 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.

Advertisement
Advertisement