
డసాల్ట్ ఏవియేషన్తో రిలయన్స్ ఇన్ఫ్రా ఒప్పందం
తొలిసారిగా ఫ్రాన్స్ వెలుపల తయారీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారత్లో ఫాల్కన్ 2000 బిజినెస్ ఎగ్జిక్యూటివ్ జెట్ విమానాలను తయారు చేసేందుకు ఫ్రాన్స్ ఏరోస్పేస్ దిగ్గజం డసాల్ట్ ఏవియేషన్తో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ (ఆర్ఏఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విమానాలను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయడం ఇదే ప్రథమం. ప్యారిస్ ఎయిర్షో సందర్భంగా ఇరు సంస్థలు ఈ విషయం ప్రకటించాయి.
హై ఎండ్ బిజినెస్ జెట్స్ తయారీకి భారత్ వ్యూహాత్మక కేంద్రంగా ఎదిగేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. దీని ప్రకారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో ‘ఫాల్కన్ 2000 జెట్స్’ కోసం అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయనున్నాయి. దీంతో బిజినెస్ జెట్స్ను తయారు చేయడంలో అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్ సరసన భారత్ కూడా చేరుతుంది.
మేకిన్ ఇండియా నినాదానికి తమ మద్దతును తెలియజేసేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని డసాల్ట్ ఏవియేషన్ చైర్మన్ ఎరిక్ ట్రాపియర్ తెలిపారు. రిలయన్స్ గ్రూప్ ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయని గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ అనిల్ డి. అంబానీ పేర్కొన్నారు. జంట ఇంజిన్లుండే ఈ విమానాల్లో 8–10 మంది వరకు ప్రయాణించవచ్చు. 2028 నాటికి తొలి మేడిన్ ఇండియా ఫాల్కన్ 2000 విమానం డెలివర్ కానుంది.
డసాల్ట్ ఏవియేషన్ గత వందేళ్లలో 90 పైగా దేశాలకు 10,000 మిలిటరీ, పౌర విమానాలను సరఫరా చేసింది. 2017లో డసాల్ట్ ఏవియేషన్, రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ (డీఆర్ఏఎల్) జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేశాయి. 2019లో ఫాల్కన్ 2000 ముందు భాగా న్ని ఉత్పత్తి చేసినప్పటి నుంచి 100కు పైగా కీలకమైన సబ్–సెక్షన్లను ఈ జేవీ తయారు చేస్తోంది. అంతర్జాతీయంగా ఫాల్కన్ జెట్స్ తయారీలో కీలకంగా ఎదిగింది.