
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను పరిరక్షించే బాటలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజా మార్గదర్శకాలను తీసుకువచ్చింది. దీంతో అన్నిరకాల క్లయింట్ల నిధులను ఇకపై స్టాక్ బ్రోకర్లు క్లయరింగ్ కార్పొరేషన్ల(సీసీలు)కు బదిలీ చేయవలసి ఉంటుంది. రోజువారీ ప్రాతిపదికన క్లయింట్ల ఎలాంటి నిధులనూ కలిగి ఉండేందుకు వీలుండదు. వెరసి నగదు, ఫిక్స్డ్ డిపాజిట్ రసీదు లేదా మ్యూచువల్ ఫండ్స్ ఓవర్నైట్ పథకాల యూనిట్ల తనఖా రూపేణా స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ సభ్యులు క్లయింట్ల నిధులను సీసీలకు చేర్చవలసి ఉంటుంది.
పైన ప్రస్తావించినవి కాకుండా ఇతరత్రా క్లయింట్ల నిధులుంటే కటాఫ్ సమయంలోగా సీసీకి బదిలీ చేయవలసి ఉంటుంది. తాజా మార్గదర్శకాలు 2023 జులై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఒక సర్క్యులర్ ద్వారా సెబీ తెలియజేసింది. కాగా.. సీసీ నిబంధనలు కలిగిన బ్యాంకుల ద్వారా మాత్రమే ఎఫ్డీఆర్లకు అనుమతి ఉంటుంది. ఇక క్లయింట్ల నిధులకు సంబంధించి ఎంఎఫ్ ఓవర్నైట్ పథకాల ద్వారా స్టాక్ బ్రోకర్లకు సరికొత్త అవకాశాలను కల్పిస్తున్నట్లు సర్క్యులర్లో సెబీ పేర్కొంది.