పబ్జి ప్రియులకు ఇది చేదు వార్తే.. | Central Government Breaks Silence on Launch Date of PUBG | Sakshi
Sakshi News home page

పబ్జి గేమ్ లాంచింగ్ ఇప్ప‌ట్లో లేన‌ట్లే..

Dec 20 2020 3:08 PM | Updated on Dec 20 2020 5:10 PM

Central Government Breaks Silence on Launch Date of PUBG - Sakshi

భారత్ లో పబ్జి గేమ్ ఇప్పట్లో లాంచ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. దేశ సరిహద్దుల్లో చైనాతో నెల‌కొన్నవివాదం నేపథ్యంలో దేశ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో 118 చైనా యాప్‌లను నిషేదించింది. ఈ నిషేధిత జాబితాలో ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన పబ్జి గేమ్ కూడా ఉంది. అయితే, ఈ గేమ్ నిర్వాహకులు టెన్సెంట్ గేమ్స్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకొని ప‌బ్‌జి కార్పొరేషన్ సొంత సంస్థ‌గా భార‌త్‌లో రిజిస్ట‌ర్ చేసుకుంది. దీనిలో భాగంగా "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతొ తిరిగి మార్కెట్లోకి రావాలని భావిస్తుంది. గేమ్‌ను మ‌ళ్లీ భార‌త్‌లో లాంచ్ చేసేందుకు ఇంకా ప‌బ్‌జి కార్పొరేషన్ కి కేంద్రం నుండి అనుమ‌తులు లభించడంలేదు. పబ్జి ప్రీయులకు ఇది  చేదువార్తే.  (చదవండి: ఫేస్‌బుక్ లో మరో లోపం)

అయితే, ఇదే విషయంపై ఇటీవల ఒకరు పబ్జి గేమ్ విడుదలపై ఆర్టీఐ ద్వారా సంబంధిత శాఖను సమాచారం కోరారు. ఈ ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందిస్తూ.. ''పబ్జి ప్రారంభించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎటువంటి అనుమతి ఇవ్వలేదు" అని ప్రకటించింది. ఈ ఆర్టీఐ ప్రశ్నను నవంబర్ 30న దాఖలు చేసినట్లు సమాచారం. ఆర్టీఐని సమాచారం కోరిన లేఖలో ఈ విదంగా ఉంది.. "ప్రియమైన సార్/ మేడమ్ 2020 సెప్టెంబర్ నెలలో మీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో భాగంగా భారత ప్రభుత్వం వివిధ చైనీస్ యాప్ లను నిషేధించింది. వాటిలో ఒకటి పబ్జి మొబైల్ గేమ్. ఇప్పుడు, దీని గురుంచి బయట చాల వార్తలు వస్తున్నాయి. భారతీయుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఈ గేమ్ "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతొ త్వరలో రానున్నట్లు చాలా పుకార్లు వస్తున్నాయి. మీరు భారత్ లో ప్రారంభించడానికి ఈ గేమ్ కి అనుమతి ఇచ్చారా లేదా అనే విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను" అని ఆర్టీఐ దాఖలు చేసిన పిర్యాదులో ఉంది.    
 
పబ్జి గేమ్ డెవలపర్లు తెలిపిన ప్రకారం.. 'పబ్జి మొబైల్ ఇండియా గేమ్'లో స్థానిక సంస్కృతీ ప్రతిబింబించేలా ఆటలో మార్పుచేసినట్లు తెలిపారు. చిన్న పిల్లలు ఎక్కువ సేపు గేమ్ ఆడకుండా ఉండటానికి కొత్త సెట్టింగ్స్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. పబ్జి కార్పొరేషన్ పాత్రల దుస్తులు, గ్రీన్ హిట్ ఎఫెక్ట్స్, ఆట సమయంపై పరిమితులు విధించినట్లు తెలిపారు. అలాగే కొత్తగా వర్చువల్ సిమ్యులేషన్ ట్రైనింగ్ గ్రౌండ్ సెట్టింగ్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే, ఇప్పటికే కొన్ని పబ్జి గేమ్ ఏపీకే లింకులు బయట కనిపిస్తున్నాయి. అయితే, హ్యాకర్స్ ఈ ఏపీకే లింకులు ద్వారా మీ మొబైల్ ని హ్యాక్ చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement