రూ.2.8 కోట్ల విరాళాలు నిలిపేసిన బైడెన్‌ పార్టీ | Biden Campaign Democratic Party Freeze 340K Dollars Donation From Indian American Businessman, Says Report - Sakshi
Sakshi News home page

రూ.2.8 కోట్ల విరాళాలు నిలిపేసిన బైడెన్‌ పార్టీ

Published Thu, Mar 21 2024 11:39 AM

Biden Campaign Democratic Party Freeze 340K Dollars Donation - Sakshi

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన డెమోక్రటిక్ పార్టీ ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఇచ్చిన మొత్తం సుమారు 3.4 లక్షల డాలర్లు(రూ.2.8 కోట్లు) విరాళాలను నిలిపేసినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది.

పొలిటికో కథనం ప్రకారం.. బిడెన్ విక్టరీ ఫండ్(బీవీఎఫ్‌) కోసం తాజాగా ఇండో అమెరికన్‌ వ్యాపారవేత్త గౌరవ్ శ్రీవాస్తవ 50,000 డాలర్లు(రూ.41 లక్షలు) విరాళాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం అది సాధ్యంకాదని, ఆ విరాళాన్ని నిలిపివేస్తున్నట్లు జో బైడెన్ ప్రచార అధికారి తెలిపారు. గతంలోనూ డెమోక్రాటిక్ కాంగ్రెషనల్ ప్రచార కమిటీ (డీసీసీసీ)కు తాను ఇచ్చిన 2.9లక్షల డాలర్లను హోల్డ్‌లో పెడుతున్నట్లు చెప్పారు. 

లాస్ ఏంజిల్స్‌కు చెందిన శ్రీవాస్తవ తన భార్య గౌరవ్ షారన్ పేరుతో, శ్రీవాస్తవ ఫ్యామిలీ ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. తనకు ఇతర కంపెనీలు ఉ‍న్నాయి. అయితే ఆ సంస్థలు నిత్యం చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. అవి ఎలాంటి వివాదాలో మాత్రం తెలియరాలేదు. 2022లో బాలిలో జరిగిన ప్రపంచ ఆహార భద్రతా ఫోరమ్‌కు తన ఫ్యామిలీ 1 మిలియన్ డాలర్లు విరాళం ప్రకటించింది. అనంతరం అతడి సంస్థల్లో వివాదాలు నెలకొన్నాయి. ఆ అంశాలు కోర్టు వరకు వెళ్లడంతో థింక్ ట్యాంక్ అట్లాంటిక్ కౌన్సిల్ అతనితో సంబంధాలు తెంచుకుంది. 

అమెరికా ఎన్నికల చట్టాల ప్రకారం..ఎ‍న్నికల్లో పోటీచేసే అభ్యర్థికి ఒక వ్యక్తి 3,300 డాలర్లకు మించి విరాళం ఇవ్వకూడదనే నిబంధన ఉంది. అయితే నిర్దిష్ట అవసరాలను తీర్చే ప్రచార కమిటీలకు మాత్రం విరాళాలు ఇవ్వడానికి అనుమతులున్నాయి. దాంతో డీసీసీసీకు శ్రీవాస్తవ భారీగా విరాళం ఇచ్చారు. ఆ విరాళాలను బీవీఎఫ్‌ బైడెన్ ప్రచారానికి, డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి, స్టేట్‌ పార్టీ యూనిట్లకు విభజించింది. ప్రస్తుతం తెరపైకి వస్తున్న వివాదాలతో ఆ విరాళాలను స్వచ్ఛంద సంస్థలకు బదిలీచేస్తున్నట్లు డెమోక్రాట్‌ల ప్రతినిధి చెప్పారు. 

డీసీసీసీకు విరాళం ఇచ్చిన సమయంలో గౌరవ్‌ తాను యూనిటీ రిసోర్స్ గ్రూప్ (యూఆర్‌జీ) ఛైర్మన్‌ను అంటూ చెప్పుకున్నారని కథనం ద్వారా తెలిసింది. ప్రతికూల వాతావరణంలో విజయాన్ని సాధించే వ్యాపారాలు, ప్రభుత్వాలు, సంస్థల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించే ప్రముఖ సంస్థ యూఆర్‌జీ అంటూ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

ఇదీ చదవండి: వాట్సప్‌ స్టేటస్‌ పెడుతున్నారా..? అదిరిపోయే అప్‌డేట్‌ మీ కోసమే!

బైడెన్ సెనేటర్‌గా ఉన్న సమయంలో అతడికి సహాయకుడిగా పనిచేసిన అంకిత్ దేశాయ్ నిర్వహించిన లాబీయింగ్ సంస్థ ఏర్పాటులో యూనిటీ రిసోర్స్ గ్రూప్‌ భాగమైందని పొలిటికో నివేదించింది. నాటో మిత్రపక్ష కమాండర్‌గా పనిచేసి, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని చేజార్చుకున్న రిటైర్డ్ జనరల్ వెస్లీ క్లార్క్‌ను గౌరవ్ శ్రీవాస్తవ కన్సల్టెంట్‌గా నియమించుకున్నారు. కొన్ని కారణాల వల్ల విడిపోయారని పొలిటికో తెలిపింది. గౌరవ్‌ శ్రీవాస్తవకు వ్యక్తిగతంగా ఒక వెబ్‌సైట్‌ ఉంది. అందులోకి ‘హాయ్.. నేనో ఫిలాంథ్రోఫిస్ట్‌(పరోపకారిని)’ అంటూ రావడం విశేషం. 

Advertisement
Advertisement