కృత్రిమ మేధస్సు (AI) విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటి నీటి వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెజాన్ భారత్లో నీటి సంరక్షణ రంగంలో కీలక మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. కంపెనీ భారత కార్యకలాపాలు 2026లో “వాటర్ పాజిటివ్” హోదాను సాధించాయని తెలిపింది. అంటే డేటా సెంటర్లు, కార్పొరేట్ కార్యాలయాలు, గిడ్డంగులు కలిపి వినియోగించే నీటి కంటే ఎక్కువ పరిమాణాన్ని వివిధ పునరుద్ధరణ కార్యక్రమాల ద్వారా సమాజానికి తిరిగి అందిస్తున్నట్లు అర్థం.
అమెజాన్ తన కేంద్రాల్లో నీటి వినియోగాన్ని తగ్గించడం, వాటర్షెడ్ పునరుద్ధరణ, సమర్థవంతమైన నీటిపారుదల ప్రాజెక్టులు, సరస్సుల పునరుద్ధరణ వంటి చర్యల వల్ల ఈ లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించిన గడువుకంటే ఏడాది ముందే చేరుకుంది. బెంగళూరు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఏటా సుమారు 32.5 కోట్ల లీటర్ల నీటిని ఆదా చేసే కార్యక్రమాలను కూడా సంస్థ అమలు చేస్తోంది.
ఏఐ సేవల విస్తరణతో డేటా సెంటర్ల విద్యుత్, నీటి అవసరాలు పెరుగుతున్నాయని పర్యావరణ సంస్థలు, వాటాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలు తమ పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే చర్యలను వేగవంతం చేస్తున్నాయి. అమెజాన్ ఇప్పటికే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా తన డేటా సెంటర్ కార్యకలాపాలను వాటర్ పాజిటివ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్లోని తమ డేటా సెంటర్లలో శీతలీకరణ కోసం నీటిని ఉపయోగించడం లేదని సంస్థ స్పష్టం చేసింది.
భారత్లో నీటి సంక్షోభం మరింత తీవ్రంగా మారుతున్న తరుణంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతం మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచినీటి వనరుల్లో దేశం వాటా కేవలం 4 శాతమే. ఇటీవల బలహీన రుతుపవనాలు, ఎల్నినో ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో నీటి కొరత తీవ్రమైంది. ముంబై వంటి మహానగరాల్లో కూడా నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి.
ఇదిలా ఉండగా, అమెజాన్ 2030 నాటికి భారత్లో 35 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఇందులో క్లౌడ్ విభాగమైన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) మహారాష్ట్రలోనే సుమారు 8.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ కూడా భారత డేటా సెంటర్ రంగంలో భారీ పెట్టుబడులను ప్రకటించడంతో దేశంలో డిజిటల్ మౌలిక వసతుల విస్తరణ మరింత వేగం పుంజుకుంటోంది.


