న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 300 నగరాలకు తన క్విక్ కామర్స్ సర్వీస్ ‘అమెజాన్ నౌ’ను విస్తరించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ విస్తరణతో భారతదేశంలోనే అతిపెద్ద ‘నిమిషాల్లో డెలివరీ’ నెట్వర్క్ను నిర్మించాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. ప్రారంభించినప్పటి నుంచి ప్రతి త్రైమాసికంలో అమెజాన్ నౌ ఆర్డర్లు రెట్టింపు అవుతున్నాయని, దీంతో ఇది అమెజాన్ ఇండియా చరిత్రలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ వ్యాపార విభాగంగా నిలిచిందని కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, పుణె, హైదరాబాద్, అమృత్సర్, కొచ్చి తదితర 15కు పైగా మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో అమెజాన్ నౌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 5 కోట్లకు పైగా వినియోగదారులకు ఈ సేవ చేరువైంది. కిరాణా వస్తువులు, పండ్లు, కూరగాయలు, ఫ్రోజెన్ ఫుడ్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులు, చిన్న గృహోపకరణాలు, కిచెన్ వస్తువులు తదితర వేలాది ఉత్పత్తులను నిమిషాల్లోనే వినియోగదారులకు అందిస్తోంది. భారత్ పర్యటనకు వచ్చిన కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ ముంబైలోని అమెజాన్ మైక్రో ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను సందర్శించారు.
దేశవ్యాప్తంగా వినియోగదారుల అవసరాలను మరింత వేగంగా తీర్చేందుకు మైక్రో ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, అర్బన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల నెట్వర్క్ను విస్తరించాలని అమెజాన్ యోచిస్తోంది. ప్రస్తుతం లక్షల సంఖ్యలో ఉత్పత్తులను అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ చేయగల సామర్థ్యాన్ని సంస్థ కలిగి ఉందని వెల్లడించింది.
ఇదే సందర్భంగా డెలివరీ అసోసియేట్ల సంక్షేమం కోసం ‘సమ్మాన్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా అమెజాన్ ప్రారంభించింది. ఇటీవల ప్రకటించిన 30 కోట్ల డాలర్ల పెట్టుబడిలో భాగాన్ని ఈ కార్యక్రమం విస్తరణకు వినియోగించనుంది. ఇందులో డెలివరీ సిబ్బంది పిల్లలకు విద్యా స్కాలర్షిప్లు, ఆరోగ్య, జీవిత బీమా, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రాప్యత, ఆర్థిక చేరిక కార్యక్రమాలు, రోడ్డు భద్రతా చర్యలు వంటి పలు ప్రయోజనాలు అందించనున్నారు. అలాగే ఈ ఏడాదిలో ‘ఆశ్రయ్’ విశ్రాంతి కేంద్రాల సంఖ్యను 250కు పెంచి, పరిశ్రమలోని అన్ని డెలివరీ అసోసియేట్లకు అందుబాటులో ఉంచనున్నట్లు అమెజాన్ వెల్లడించింది.


