ఎయిర్‌ ప్యూరిఫయర్లకు డిమాండ్‌ | Air purifier sales spike over 50percent as air quality worsens in Delhi-NCR | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ప్యూరిఫయర్లకు డిమాండ్‌

Nov 5 2024 5:41 AM | Updated on Nov 5 2024 8:00 AM

Air purifier sales spike over 50percent as air quality worsens in Delhi-NCR

50 శాతం పెరిగిన అమ్మకాలు 

ఢిల్లీ పరిధిలో పడిపోయిన వాయు నాణ్యత 

అధిక విక్రయాలు కొనసాగుతాయన్న అంచనాలు 

న్యూఢిల్లీ: ఎయిర్‌ ప్యూరిఫయర్లకు (గాలిని శుద్ధి చేసే పరికరాలు) డిమాండ్‌ పెరుగుతోంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ వంటి ప్రాంతాల్లో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిలకు చేరడం ఇందుకు నేపథ్యమని తయారీదారులు చెబుతున్నారు. ప్రస్తుత పండుగల సీజన్‌లో ఎయిర్‌ ప్యూరిఫయర్ల అమ్మకాలు గతేడాది ఇదే సీజన్‌తో పోలి్చనప్పుడు 50 శాతం పెరిగినట్టు కెంట్‌ ఆర్‌వో సిస్టమ్స్, షావోమీ, ఎల్‌జీ ఎల్రక్టానిక్స్‌ ఇండియా వెల్లడించాయి. 

ఎయిర్‌ ప్యూరిఫయర్ల కోసం గడిచిన 2–3 వారాలుగా విచారణలు పెరిగాయని, గాలి నాణ్యత సూచీ రానున్న రోజుల్లో మరింత ప్రమాదకర స్థాయికి చేరుకోనున్న (శీతాకాలం కావడంతో) దృష్ట్యా వీటి అమ్మకాలు ఇంకా పెరుగుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఎయిర్‌ ప్యూరిఫయర్ల విభాగం పరిమాణం పరంగా చాలా చిన్నది కావడం గమనార్హం. ఏటా అక్టోబర్‌–నవంబర్‌ కాలంలో వీటి అమ్మకాలు గరిష్టానికి చేరుతుంటాయి. ఆ సమయంలో ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతుంటుంది. దీపావళి వేడుకలకుతోడు పంట వ్యర్థాల దహనం ఇందుకు కారణం.  

ఒక్కసారిగా డిమాండ్‌.. 
‘‘ఢిల్లీ అత్యంత కాలుష్యంతో కూడిన సీజన్‌ను ప్రస్తుతం చూస్తోంది. దీంతో అక్కడ ఉన్నట్టుండి ఎయిర్‌ ప్యూరిఫయర్లకు డిమాండ్‌ ఏర్పడింది’’అని ఎల్‌జీ ఎల్రక్టానిక్స్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ చిత్కార తెలిపారు. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయిని దాటిపోతే అప్పుడు కాలుష్య కారకాలు పీఎం 2.5 పారి్టకల్స్‌ కంటే సూక్ష్మంగా ఉంటాయని, వీటిని వడగట్టడం కూడా కష్టమేనన్నారు. శీతాకాలంలో వాయునాణ్యత క్షీణించడం వల్ల ఎయిర్‌ ప్యూరిఫయర్లు, ఫిల్టర్ల అమ్మకాలు సహజంగానే పెరుగుతుంటాయని కెంట్‌ఆర్‌వో సిస్టమ్స్‌ సీఎండీ మహేష్‌ గుప్తా తెలిపారు. ఉత్తరాది ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి కాలుష్యం చేరడంతో తమ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం వినియోగదారులు ఎయిర్‌ ప్యూరిఫయర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నట్టు వివరించారు.

 ఇప్పటికే అమ్మకాలు 20–25 శాతం మేర అధికంగా నమోదైనట్టు చెప్పారు. సాధారణం కంటే 50 శాతం మేర అధికంగా ఎయిర్‌ ప్యూరిఫయర్, ఫిల్టర్ల అమ్మకాలు పెరిగినట్టు షావోమీ ఇండియా అధికార ప్రతినిధి సైతం వెల్లడించారు. 2023 నాటికి ఎయిర్‌ ప్యూరిఫయర్ల మార్కెట్‌ విలువ రూ.778 కోట్లు ఉన్నట్టు.. 2024 నుంచి 2032 వరకు ఏటా 16 శాతం కంటే ఎక్కువే వృద్ధిని నమోదు చేస్తుందని ఒక అంచనా. ‘‘కాలుష్యం అదే పనిగా పెరిగిపోతుండడంతో  హానికారకాల నుంచి తమ కుటుంబ సభ్యులను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. అందుకే చాలా మంది కాలుష్యం నుంచి రక్షణగా ఈ కాలంలో బయటకు వెళ్లడానికి బదులు ఇళ్లల్లో ఉండేందుకే ప్రాధాన్యమిస్తుంటారు’’అని బ్రిటిష్‌ కంపెనీ డైసన్‌ పేర్కొంది. ఈ సంస్థ సైతం ఎయిర్‌ ప్యూరిఫయర్లను విక్రయిస్తుంటుంది.  

Advertisement
 
Advertisement
Advertisement