భారతదేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా ఎదగడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో దిగుమతి చేసే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా డీజిల్లో 15 శాతం వరకు ఐసోబ్యుటనాల్ మిశ్రమాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
ఇప్పటికే పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం కలిపే చర్యలు జరుగుతున్నాయి. అయితే.. ఇథనాల్ను నేరుగా డీజిల్లో కలపడం సాధ్యం కాదు. కాబట్టి ఇథనాల్ నుంచే ఐసోబ్యుటనాల్ను ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించాలనే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన తెలిపారు. ఐసోబ్యుటనాల్ డీజిల్కు బదులుగా ఉపయోగపడగల సమర్థవంతమైన ఇంధనమని ఆయన పేర్కొన్నారు.
ఈ కొత్త ఇంధన మిశ్రమంపై ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహించినట్లు గడ్కరీ పేర్కొన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో వాహన ఇంజిన్లను కూడా ఈ ఇంధనాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సి ఉందని వివరించారు.
ఐసోబ్యుటనాల్ను తరువాతి తరం బయోఫ్యూయల్గా పరిగణిస్తున్నారు. దీనికి అధిక ఎనర్జీ డెన్సిటీ ఉండటం, ఇంజిన్లతో మెరుగైన అనుకూలత కలిగి ఉండటం, తక్కువ కాలుష్యం ఉత్పత్తి చేయడం వంటి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఈ ఇంధనాన్ని విస్తృతంగా ఉపయోగిస్తే.. భారత్ ముడి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా.. దేశంలో బయోఫ్యూయల్ ఉత్పత్తికి కొత్త అవకాశాలు కూడా ఏర్పడనున్నాయని భావిస్తున్నారు.
కాగా ఇప్పటికే.. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే విజయవంతం చేసింది. దీనివల్ల దేశానికి భారీ విదేశీ మారకద్రవ్యం ఆదా కావడంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గిందని, రైతులకు అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడ్డాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: దేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ప్రారంభం!


