స్కోడా ఇండియా అయిదేళ్ల విరామం తర్వాత భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోని డీజిల్ విభాగంలోకి మళ్లీ అడుగుపెట్టింది. ఇందులో భాగంగా తన ప్రీమియం ఎగ్జిక్యూటివ్ సెడాన్ ‘ఆల్–న్యూ సూపర్బ్’ డీజిల్ వెర్షన్ను మంగళవారం ఆవిష్కరించింది. ‘‘స్కోడా ఫ్లాగ్షిప్ లగ్జరీ సెడాన్ ‘సూపర్బ్ టీడీఐ’ డీజిల్ పవర్ట్రెయిన్తో రావడం వల్ల దీని ఆకర్షణ మరింత పెరుగుతుంది. భారతీయ వినియోగదారులకు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందించడమే మా లక్ష్యం’’ అని స్కోడా ఆటో తెలిపింది. దేశంలో బీఎస్–6 ఉద్గార నిబంధనలు అమల్లోకి రావడానికి ముందే స్కోడా ఇండియా తన డీజిల్ మోడళ్ల విక్రయాలను నిలిపివేసింది.
భారత్ కోసం ప్రత్యేక ప్లాట్ఫాంపై ‘స్లావియా’
సరికొత్త ఆకర్షణీయమైన ఫీచర్లతో ‘స్లావియా’ కారును కూడా కంపెనీ ఆవిష్కరించింది. భారతీయ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా ఎంక్యూబీ–ఏ0–ఇన్ ప్లాట్ఫామ్పై ‘స్లావియా’ను రూపొందించినట్లు తెలిపింది. ఇది దేశంలోని అత్యంత విజయవంతమైన సెడాన్లలో ఒకటిగా నిలిచిందని పేర్కొంది. కొత్త స్లావియా మెరుగైన స్టైలింగ్, సరికొత్త సాంకేతికత, సెగ్మెంట్లో తొలిసారిగా అందిస్తున్న ఫీచర్లు, అధిక సౌకర్యాలను అందిస్తుందని తెలిపింది. అలాగే డ్రైవింగ్ అనుభూతి, ప్రాక్టికాలిటీ, భద్రత వంటి అంశాలను కొనసాగించినట్లు పేర్కొంది. ఇదే సందర్భంగా స్పోర్టియర్ వెర్షన్ ‘ఆక్టేవియా ఆర్ఎస్’ మోడల్ను కూడా భారత్లోకి తిరిగి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
‘‘ స్కోడా కీలకమైన గ్లోబల్ వృద్ధి మార్కెట్లలో భారత్ అత్యంత కీలకమైంది. స్లావియా మా విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. స్పష్టమైన వ్యూహం, బలమైన స్థానిక ఉనికితో భారత్లో మా వృద్ధి ప్రయాణానికి తదుపరి అధ్యాయం లిఖిస్తున్నాము’’ అని స్కోడా ఆటో సీఈవో క్లాస్ జెల్మర్ తెలిపారు.
ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?


