
వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్గా గుర్తింపు
బ్రాండ్ ఫైనాన్స్ లిస్టులో చోటు
అత్యంత విలువైన బ్రాండ్ టాటా
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా ఎదుగుతున్న భారతీయ బ్రాండుగా అదానీ గ్రూప్ నిల్చింది. 2025కి గాను బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన అత్యంత విలువైన భారతీయ బ్రాండ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ రిపోర్టు ప్రకారం అదానీ బ్రాండ్ విలువ 2024లో 3.55 బిలియన్ డాలర్లుగా ఉండగా తాజాగా 2.91 బిలియన్ డాలర్లు పెరిగి 6.46 బిలియన్ డాలర్లకు ఎగిసింది. ఓవరాల్గా గతేడాది 16వ స్థానంలో ఉండగా ఈసారి 13వ ర్యాంకుకు చేరింది. 82 శాతం బ్రాండ్ విలువ వృద్ధితో అదానీ గ్రూప్ అత్యంత వేగంగా ఎదుగుతున్న భారతీయ బ్రాండుగా నిల్చిందని రిపోర్ట్ పేర్కొంది. తాజా నివేదిక ప్రకారం..
→ ఇండియా 100 జాబితాలోని మొత్తం సంస్థల బ్రాండ్ విలువ 236.5 బిలియన్ డాలర్లు.
→ అత్యంత విలువైన భారతీయ బ్రాండుగా టాటా గ్రూప్ మరోసారి అగ్రస్థానంలో నిల్చింది. బ్రాండ్ విలువ 10 శాతం వృద్ధి చెంది 31.6 బిలియన్ డాలర్లకు చేరింది.
→ 15 శాతం బ్రాండ్ విలువ (16.3 బిలియన్ డాలర్లు) వృద్ధితో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ జాబితాలో అత్యంత విలువైన రెండో భారతీయ బ్రాండుగా నిల్చింది.
→ హెచ్డీఎఫ్సీ గ్రూప్ బ్రాండ్ విలువ 14.2 బిలియన్ డాలర్లకు చేరడంతో ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో నిల్చింది. ఎల్ఐసీ (13.6 బిలియన్ డాలర్లు) నాలుగో ర్యాంకు, హెచ్సీఎల్టెక్ (బ్రాండ్ విలువ 17 శాతం అప్, 8.9 బిలియన్ డాలర్లు) ఒక ర్యాంకు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరింది. ఎల్అండ్టీ గ్రూప్ (7.4 బిలియన్ డాలర్లు) తొమ్మిదో స్థానంలో, మహీంద్రా గ్రూప్ (7.2 బిలియన్ డాలర్లు) 10వ స్థానంలో నిల్చాయి.
→ అత్యంత పటిష్టమైన భారతీయ బ్రాండుగా తాజ్ హోటల్స్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానాన్ని కాపాడుకుంది.