వాట్సాప్‌ గ్రూప్‌లో చేరాడు.. రూ.11 కోట్లు పోయాయి | 75 year old man duped Rs 11 crore in Mumbai Cyber Fraud | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ గ్రూప్‌లో చేరాడు.. రూ.11 కోట్లు పోయాయి

Nov 29 2024 3:41 PM | Updated on Nov 29 2024 4:36 PM

75 year old man duped Rs 11 crore in Mumbai Cyber Fraud

టెక్నాలజీ పెరుగుతోంది.. స్కామర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎంతోమంది బాధితులు మోసపోయి లెక్కకు మించిన డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి మరో సంఘటనే తెరమీదకు వచ్చింది.

ముంబైలోని కోలాబాకు చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ షిప్ కెప్టెన్‌ను.. మొదట గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాడు. అతడు పెట్టుబడికి సంబంధించిన సలహాలు ఇస్తూ.. షేర్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలను వెల్లడించాడు. దీనికోసం ఒక యాప్‌లో పెట్టుబడి పెట్టమని సూచించారు. అప్పటికే చాలామంది లాభాలను పొందుతున్నట్లు కూడా పేర్కొన్నాడు.

గుర్తు తెలియని వ్యక్తి చెప్పిన మాటలు నిజమని కెప్టెన్ నమ్మేశాడు. దీంతో స్కామర్ బాధితున్ని మరో వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాడు. కంపెనీ ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్‌ను షేర్ చేశాడు. బాధితుడు యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత.. ట్రేడింగ్, ఐపీఓ వంటి వాటికి సంబంధించిన మెసేజ్‌లను అందుకుంటాడు. అదే సమయంలో స్కామర్.. బాధితుని ఇంకొక వ్యక్తిని పరిచయం చేసాడు. ఆ వ్యక్తి.. బాధితుడు సిఫార్సు చేసిన స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడానికి వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని ఒప్పించాడు.

లావాదేవీలన్నీ సెప్టెంబర్ 5, అక్టోబర్ 19 మధ్య జరిగాయి. బాధితుడు 22 సార్లు.. మొత్తం రూ. 11.16 కోట్లు వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసాడు. వేరు వేరు ఖాతాకు ఎందుకు డబ్బు బదిలీ చేయాలని బాధితుడు స్కామర్లను అడిగినప్పుడు.. ట్యాక్స్ ఆదా చేయడానికి అని అతన్ని నమ్మించారు.

కొన్ని రోజుల తరువాత తన నిధులలో కొంత తీసుకోవాలనుకుంటున్నానని.. స్కామర్లు అడిగినప్పుడు, సర్వీస్ ట్యాక్స్ కింద పెట్టుబడులపై 20 శాతం చెల్లించాలని కోరారు. ఇది చెల్లించిన తరువాత కూడా.. మళ్ళీ మళ్ళీ ఏదేది సాకులు చెబుతూ.. మోసం చేస్తూనే ఉన్నారు. చివరకు బాధితుడు మోసపోయామని గ్రహించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు.

ఇలాంటి మోసాల నుంచి బయటపడటం ఎలా?

👉గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను స్పందించకపోవడం మంచిది.
👉ఎక్కువ డబ్బు వస్తుందని నమ్మించడానికి ప్రయత్నించడం, లేదా లింకులు పంపించి వాటిపై క్లిక్ చేయండి.. మీకు డబ్బు వస్తుంది అని ఎవరైనా చెబితే.. నమ్మకూడదు.
👉స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన విషయాలను చెబుతూ.. ఎక్కువ లాభాలు వస్తాయని చెబితే నమ్మవద్దు. 
👉షేర్ మార్కెట్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే.. నిపుణలను సందర్శించి తెలుసుకోవాలి. లేదా తెలిసిన వ్యక్తుల నుంచి నేర్చుకోవాలి.
👉స్కామర్లు రోజుకో పేరుతో మోసాలు చేయడానికి పాల్పడుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.

Advertisement
 
Advertisement
Advertisement