వెండి రూ.7500 డౌన్
బంగారం రూ.2,200 ప్లస్
న్యూఢిల్లీ: అమ్మకాల ఒత్తిడికి వెండి నష్టపోగా.. కొనుగోళ్ల మద్దతుతో పసిడి ధరలు పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం వెండి కిలోకి రూ.7,500 నష్టపోయి రూ.2,64,500 లక్షలకు (పన్నులు కలుపుకుని) పరిమితమైంది. బంగారం 10 గ్రాములకు రూ.2,200 పెరిగి రూ.1,60,700 వద్ద (పన్నులు సహా) స్థిరపడింది. జ్యుయలర్లు, ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన కొనుగోళ్లు వరుసగా రెండో రోజు పసిడి ధరలు పెరగడానికి కారణమని ట్రేడర్లు తెలిపారు.
బంగారం, వెండి ధరలు ఒక శ్రేణి పరిధిలో చలించొచ్చని.. ఈ మార్కెట్లు సమీప కాలానికి స్థిరీకరణ దశలోకి ప్రవేశించినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్కు ఒక డాలర్కు పైగా నష్టపోయి రూ.82.16 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయింది. బంగారం స్వల్ప నష్టంతో ఔన్స్ 5,052 డాలర్ల స్థాయిలో కదలాడింది. అమెరికాలో రిటైల్ విక్రయాలు, నిరుద్యోగ డేటా కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు.


