భద్రాచలంటౌన్: వారాంతం కావడంతో శనివారం పలు ప్రాంతాల నుంచి భక్తులు భద్రాచలం తరలివచ్చారు. నదిలో వరద ఉధృతి ఉండటంతో భక్తులు, పర్యాటకులను స్నాన ఘాట్ల వైపు వెళ్లకుండా పోలీసులు, రెస్క్యూ సిబ్బంది నిలిపివేశారు. కనీసం కరకట్టపైకి అనుమతించకపోవడంతో ఉధృత గోదావరిని చూడలేకపోయామని పలువురు భక్తులు పేర్కొన్నారు. దీంతో నేరుగా ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని తిరుగుముఖం పట్టారు.
దెబ్బతింటున్న కరకట్ట
భద్రాచలం: భద్రాచలంలోని వరదనీటితోపాటు మురుగు నీరును స్లూయిస్ల ద్వారా గోదావరిలోకి డంప్ చేస్తున్నారు. పైపులు కరకట్టపై వరకు మాత్రమే ఉంచారు. దీంతో నీటి ప్రవాహం ధాటికి కరకట్ట దెబ్బతింటోంది. పైపులు లీకవడంతో కట్టపై గుంతలు ఏర్పడుతున్నాయి. గతంలో సైతం ఇదే రీతిన చేయటంతో మట్టి కొట్టుకుపోయి రాళ్లు తేలాయి.


