ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్
● స్వగ్రామాలపైనే ఓటర్ల మక్కువ ● మమకారానికి తోడు ఆస్తులు ఉండడమే కారణం ● అక్కడే ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తున్న పలువురు ● జిల్లాలో వేగం పుంజుకున్న డిజిటలైజేషన్
సొంతూరికే ఓటు!
చుంచుపల్లి: జీవనోపాధి, వ్యాపారం, ఉద్యోగం రీత్యా జిల్లా నుంచి హైదరాబాద్, ఇతర పట్టణాలకు ఏళ్ల క్రితమే వేలాది కుటుంబాలు వెళ్లాయి. వీరిలో చాలా మంది స్వస్థలాలతో పాటు ప్రస్తుతం ఉంటున్న పట్టణాల్లోనూ ఓటు హక్కు కలిగి ఉన్నారు. అయితే, ‘సర్’లో భాగంగా రెండు చోట్ల ఓటు కలిగి ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించడంతో సొంతూరికే జై కొడుతున్నారు. స్వస్థలాలపై మమకారానికి తోడు ఇక్కడ భూములు, సొంత ఇళ్లు, ఆస్తులు ఉండడంతో ఎప్పటికై నా స్థిరపడొచ్చని ఓటు హక్కు కొనసాగించేందుకు ముందుకొస్తున్నారు.
తొలగింపు భయం
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో 9,96,198 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో చాలామంది జీవనోపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, సూరత్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి ప్రాంతాలకు వెళ్లారు. ఇప్పటి వరకు జరిగిన పలు ఎన్నికల్లో వీరు రెండుచోట్ల ఓటేసిన దాఖలాలు ఉన్నాయి. మొత్తంగా 18 వేల నుంచి 20 వేల మందికి రెండేసి చోట్ల ఓటుహక్కు ఉన్నట్లు అంచనా. అయితే, ‘సర్’లో భాగంగా డబుల్ ఓట్లు తొలగించడమే కాక రెండుచోట్ల ఓటుహక్కు ఉన్నట్లు తేలితే జైలుశిక్ష విధిస్తామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. దీంతో పట్టణాల్లోని ఓటు హక్కు వదులుకుని, గ్రామాల్లోనే ఎన్యుమరేషన్ ఫారాలు నింపి వెళ్తున్నారు. వారాంతాలు, ఇతర సెలవుల్లో కుటుంబాలతో వస్తున్న పలువురు ఎన్యుమరేషన్ పత్రాలు తీసుకుని తిరస్కరణకు గురికాకుండా తప్పులు లేకుండా నింపి ఇస్తున్నారు.
చకచకా డిజిటలైజేషన్
జిల్లాలో ‘సర్’ తొలినాళ్లతో పోలిస్తే ప్రస్తుతం వేగాన్ని పుంజుకుంది. గాడిలో పడిన ప్రక్రియను గడువులోగా విజయవంతంగా పూర్తి చేసేలా అధికారులు సిద్ధమవుతున్నారు. ఓటర్లు కూడా తొలుత పట్టించుకోకున్నా, ఇప్పుడు ఓటుహక్కు కోల్పోతామనే భయంతో ఎన్యుమరేషన్ ఫారాలు నింపి బీఎల్ఓలకు ఇస్తున్నారు. దీనికి రెవెన్యూ సిబ్బంది, పలు పార్టీల నాయకులు కూడా సహకరిస్తుండడంతో ఫారాల సేకరణ చకచకా జరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటర్లతో పత్రాలను నింపడమే కాక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారికి సమాచారం ఇస్తున్నారు. దీంతో వారం రోజులుగా ఎన్యుమరేషన్ పత్రాల సేకరణ, డిజిటలైజేషన్ ఊపందుకుంది. జిల్లాలోని 9,96,198 మంది ఓటర్లకు గాను సోమవారం నాటికి 7,06,766 మంది (70.95 శాతం) డిజిటలైజేషన్ పూర్తయింది. అత్యధికంగా భద్రాచలంలో 73 శాతం, అత్యల్పంగా కొత్తగూడెంలో 68.82 శాతం పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మంచి స్పందన ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు ఇంకా పూర్తిస్థాయిలో ముందుకు రావడం లేదని తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకు కొంత సహకారం లోపించిందని సమాచారం.
నియోజకవర్గం ఓటర్లు ఆన్లైన్ పూర్తి శాతం
పినపాక 2,04,518 1,40,831 68.86
ఇల్లెందు 2,28,211 1,66,330 72.88
కొత్తగూడెం 2,50,085 1,72,112 68.82
అశ్వారావుపేట 1,60,221 1,15,684 72.20
భద్రాచలం 1,53,163 1,11,809 73.00
మొత్తం 9,96,198 7,06,766 70.95


