భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామ య్య కల్యాణం వేడుకగా సాగింది. తెల్ల వారుజామునేన గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అలాగే, స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారం కావడంతో అభయాంజయనేయస్వామి ఉపాలయంలో అభిషేకం, తమలపాకార్చన పూజలు జరిగాయి.
23, 24వ తేదీల్లో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
రుద్రంపూర్/ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈనెల 23, 24 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 23న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సత్తుపల్లిలోని జేవీ ఆర్ ఓపెన్ కాస్ట్ గనులకు చేరుకోనున్న ఆయన బొగ్గు ఉత్పత్తి, నాణ్యతను పరిశీలించాక అధికా రులతో సమావేశమవుతారు. ఆతర్వాత కొత్తగూడెం చేరుకుని టీజీ జెన్కో, సింగరేణి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి బస చేస్తారు. ఇక 24వ తేదీ శుక్రవారం ఉదయం మణుగూరు వెళ్లి బీటీపీఎస్ వద్ద టీజీ జెన్కో ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన డీఏఓ పబ్లిక్ స్కూల్ను ప్రారంభిస్తారు. ఆతర్వాత మణుగూరు ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ గనులను పరిశీలించి బొగ్గు ఉత్పత్తి, నాణ్యతపై అధికారులతో చర్చిస్తారు.
ఇంకా ఏమేం పనులు ఉన్నాయి?
ఇల్లెందు: ఇల్లెందులో మినీ స్టేడియాన్ని డీవైఎస్ఓ ఎం.పరంధామిరెడ్డి, పీఆర్ ఈఈ శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండోర్, ఔట్ డోర్ జిమ్లు, వాలీబాల్, షటిల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్ను పరిశీలించి ఇంకా చేయాల్సిన పనులపై చర్చించారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమైన వారు మాట్లాడుతూ మిగులు పనులు త్వరగా పూర్తి చేస్తే క్రీడాకారులకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి, కోచ్లు కె.మహిధర్, పి.నాగేంద్ర, సుమిత్కోరీ మాట్లాడుతూ 200 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్ పనులు త్వరగా పూర్తి చేయించాలని అధికా రులను కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్ డీఈ రాంకిషన్, ఏఈ రాజు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి, గుండా శ్రీకాంత్ పాల్గొన్నారు.
డిజిటలైజేషన్
వేగంగా చేపట్టాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి
సూపర్బజార్(కొత్తగూడెం): ‘ఎస్ఐఆర్’లో భాగంగా ఓటర్ల నుంచి అందుతున్న ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వేగంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయ న జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వేగంగా జరిగేలా ప్రతీ బీఎల్ఓకు రోజువారీ లక్ష్యాలు నిర్దేశించామని తెలిపారు. యాభై శాతం కంటే తక్కువ పురోగతి ఉంటే అదనపు సిబ్బందిని కేటాయిస్తున్నామని చెప్పారు. అంతేకాక ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎన్నికల విభాగం ఉద్యోగులు రంగప్రసాద్, సాయికృష్ణ, నవీన్ పాల్గొన్నారు.
కేటీపీఎస్ 7వ దశ సీఈగా శివరాంరెడ్డి
పాల్వంచ: పాల్వంచలోని కేటీపీఎస్ 7వ దశ చీఫ్ ఇంజనీర్గా బి.శివరాంరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ సీఈగా పనిచేస్తున్న జె.సూర్యనారాయణ దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్–2కి బదిలీ అయ్యారు. కాగా, ఇప్పటివరకు కేటీపీఎస్ 5, 6వ దశల కర్మాగారంలో ఎస్ఈ(ఏడీఎం)గా విధులు నిర్వర్తిస్తున్న శివరాంరెడ్డికి సీఈగా పదోన్నతి కల్పించి 7వ దశకు కేటాయించారు. వచ్చే శుక్రవారం శివరాంరెడ్డి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.


