పట్టించుకునే వారు కరువు
భద్రాచలం ఆలయం వద్ద జోరుగా కూల్చివేతలు
పని ప్రదేశంలో కరువైన రక్షణ,
భద్రతా చర్యలు
శిథిలాల తొలగింపు పనుల్లో
కానరాని వేగం
ఆలయం చుట్టూ భక్తుల
రాకపోకలపై ఆంక్షలు
అష్టకష్టాల నడుమ దర్శనం
విస్తరణ కోసం..
ఆలయం చుట్టూ మాఢవీధులు విస్తరించనున్నారు. ఇందుకోసం ఆలయం చుట్టూ ఉన్న ఉత్తర ద్వారం, చిత్రకూట మండపం, వంటశాల తదితర నిర్మా ణాల కూల్చివేత మొదలుపెట్టారు. అంతకు ముందే చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ భవనాలను కూల్చేశారు. దీంతో ఆలయం చుట్టూ శిథిలమైన భవనా లు, ఇటుకలు, సిమెంటు దిమ్మెలు, రాళ్లు నిండిపోయాయి. శిథిలాలను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో ఆలయం చుట్టుపక్కల భక్తులు నడిచేందుకు వీల్లేని పరిస్థితి నెలకొంది.
నడవడమూ కష్టమే..
భద్రగిరి ఆలయం చుట్టూ కూల్చివేతలకు సంబంధించి శిథిలాలను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో భక్తులు నడిచేందుకు కూడా ఇబ్బంది ఎదురవుతోంది. ఇప్పటికే ఉత్తర, దక్షిణ ద్వారాల వైపు భక్తులు వచ్చిపోయేందుకు వీలు లేకుండా బారికేడ్లు అడ్డం పెట్టారు. కనీసం నడిచేందుకు నాలుగు అడుగుల జాగా కూడా వదల్లేదు. ఫలితంగా సీతారాములను దర్శించుకుని దక్షిణ ద్వారం గుండా బయటకు వచ్చిన భక్తులు గోదావరి తీరం చేరడానికి దారి లేకుండా పోయింది. ఇటు ఉత్తరం వైపు, అటు దక్షిణం వైపు బారికేడ్లు పెట్టి దారులు మూసేయడంతో చిన్న ఖాళీ నుంచి మిథిలా స్టేడియంలోకి దూరి అక్కడి నుంచి తూర్పు వైపునకు వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు వానల కారణంగా మిథిలా స్టేడియం చిత్తడిగా మారడంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఎప్పుడు కాలు జారుతుందోనని భయంతో బిక్కుబిక్కుమంటూ నడుస్తున్నారు.
రక్షణ చర్యలేవి?
శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం భద్రుడి కొండపై కొలువై ఉంది. గతంలో ఆలయం పక్కన కుసుమహరనాథ్ గుడి కింది భాగంలో ల్యాండ్స్లైడ్ జరిగింది. ఈ నేపథ్యాన కూల్చివేత పనుల్లో పాల్గొనే కార్మికుల రక్షణ, భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ రూ.వందల కోట్ల నిధులతో చేపడుతున్న పనుల్లో ఇలాంటి ఏర్పాట్లు కానరావడం లేదు. ఒకరిద్దరు ఉన్నతస్థాయి ఉద్యోగులు తప్పితే కూలీలు, మేసీ్త్రలు ఎవరికీ కనీసం హెల్మెట్లు, గ్లౌజ్లు, రేడియం జాకెట్లు ఇవ్వలేదు. కొండ దిగువన భారీ యంత్రాలతో పనులు చేస్తున్న కార్మికులకు కనీసం హెల్మెట్లు కూడా ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
సీతారాముల దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. కొందరు తొలుత గోదావరి స్నానం చేసి దర్శనానికి వెళ్తే, ఇంకొందరు దర్శనం తర్వాత గోదావరి హారతికి వెళ్తారు. అలాగే స్థానికంగా ఉన్న ఉప ఆలయాలను సందర్శిస్తారు. అయితే, ఆలయం చుట్టుపక్కల రాకపోకలపై ఆంక్షలు ఉన్న విషయమై ఎవరూ సమాచారం ఇవ్వడం లేదు. ఇక్కడ జరిగే అభివృద్ధి పనులు, ఫలితంగా చోటుచేసుకునే మార్పులపై దేవస్థానం తరఫున కనీసం ప్రచారం కూడా జరగడం లేదు. దేవస్థానం అధికారుల ఉదాసీన వైఖరిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా శిథిలాల తొల గింపు పనుల్లో వేగం పెంచడమే కాక పని ప్రదే శంలో భద్రతపై దేవస్థానం, జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమాన కూల్చివేతలు జోరందుకోగా ఎక్కడా కనీస రక్షణ చర్యలు కానరావడం లేదు. ఇదేకాక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు.. ఆలయంలోకి ఎటువైపు నుంచి, ఎలా వెళ్లాలనే అంశంపై కనీస అవగాహన కల్పించకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
రామయ్య స్వామిని చూసుకోవాలని దూరం నుంచి కుటుంబ సభ్యులతో వచ్చాం. ఎటు చూసినా కూల్చివేతల శిథిలాలే ఉన్నాయి. దీంతో ఏ దారిన పోవాలో, ఎక్కడి నుంచి రావాలో తెలియలేదు. స్టేడియంలోని బురద రోడ్డులో భయం భయంగా నడిచాం. అధికారులు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
– సీతారామ స్వామి, యానాం


