పాల్వంచరూరల్: మాసశివరాత్రిని పురస్కరించుకుని సోమవారం శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) రుద్రహోమం నిర్వహించారు. మేళతాళా లు, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతి పూజ, రుద్రహోమం చేశారు. చివరగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలో పాల్గొన్న 14 మంది భక్త దంపతులకు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలను అందజేశారు. అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు.
దీక్ష విరమించిన
సింగరేణి అధికారులు
రుద్రంపూర్: పదహారు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలను రెండు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు సీఎంఓఏఐ అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్ తెలిపారు. సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం చేపట్టిన దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలతో ప్రభుత్వం, యాజమాన్యం సానూకూలంగా స్పందించాయని అన్నారు. రెండు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఈ మేరకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు ప్రకటన చేశారని అన్నారు. రెండు నెలల్లో సమస్యలకు పరిష్కారం లభించని పక్షంలో మళ్లీ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
నైపుణ్యం
పెంపొందించుకోవాలి
పాల్వంచ: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉపాధ్యాయులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి అన్నారు. పాల్వంచలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న స్పెల్–2 శిక్షణా తరగతులను సందర్శించి మాట్లాడారు. వివిధ తరగతుల పాఠ్యాంశాల్లోని లెర్నింగ్ అవుట్ కమ్లను విద్యార్థుల చేత సాధింపజేయాలన్నారు. విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించాలని చెప్పారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. అకాడమిక్ మానిటరింగ్ అధికారి మాధవరా వు, అధికారులు పాల్గొన్నారు.


