
● గతేడాది ఇదేరోజు ముంచెత్తిన మున్నేరు ● పరీవాహక బాధితుల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎప్పటిలాగే వారంతా రేపటిపై ఆశలతో నిద్రించారు. కానీ తెల్లారేసరికి వారి కలలు ఛిద్రమయ్యాయి. కాయకష్టంతో నిలబెట్టుకున్న గూడు.. ఇతర సామగ్రిని గంగమ్మ తనలో కలిపేసుకోవడంతో కట్టుబట్టలతో మిగిలారు. గతేడాది ఆగస్టు 31న మున్నేరు పరీవాహకంలోని మహబూబాబాద్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ తరహా భారీ వర్షం కురవగా మున్నేటికి పోటెత్తిన వరద ఖమ్మం నగరాన్ని ముంచెత్తింది. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం కల్లా పరీవాహకంలోని సుమారు 60 కాలనీలు నీటమునిగాయి. మున్నేటికి రికార్డు స్థాయిలో వరద వచ్చి నేటి(సోమవారం)తో ఏడాది అవుతున్న సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..
వరద తాండవం
ఎగువన భారీ వర్షాలతో గతేడాది ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 1 తెల్లవారుజామున 3 గంటల వరకు 19 అడుగులుగా ఉన్న మున్నేరు వరద ఉదయం 11 గంటలకల్లా 36.9 అడుగులకు చేరింది. వరద 36.9 అడుగులు కాదు 41 అడుగులకు చేరిందని అధికారులు ఆ తర్వాత ప్రకటించారు. అనూహ్యంగా వరద రావడంతో ఖమ్మం నగరం, ఖమ్మంరూరల్ మండలంలోని 60 కాలనీల ప్రజలు కనీస సామగ్రి తీసుకునే వీల్లేకుండానే పునరావాస కేంద్రాలకు వెళ్లారు. వీరిలో అత్యధికంగా రోజువారీ కూలీలే కాగా.. ఇళ్లలో బురద మేటలు వేసి కొన్ని చోట్ల పూర్తిగా, ఇంకొన్ని చోట్ల పాక్షికంగా నేలమట్టమయ్యాయి. పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న గ్యాస్స్టౌలు, బియ్యం, మంచాలు, దుప్పట్లు, ఫ్రిడ్జ్లు, బీరువాలు తదితర సామగ్రి, దాచుకున్న సొమ్ము తుడిచిపెట్టుకుపోయింది.
వర్షం మొదలైతే భయం
మునుపెన్నడూ లేని రీతిలో గత ఏడాది మున్నేటికి వరద రాగా ప్రభావిత కాలనీల ప్రజలు ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటుపడుతున్నారు. అయినా చిన్నపాటి వర్షం కురిస్తే చాలు.. ఉలిక్కిపడుతున్నారు. ప్రస్తుత వర్షాలతో మళ్లీ ఎక్కడ వరద వస్తుందోనన్న ఆందోళనతో వారిలో కంటి మీద కునుకు కరువవుతోంది. ప్రస్తుతం మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతుండడం కొంత ఊరట కలిగిస్తోంది. కాగా ఒక్కో కుటుంబానికి రూ.16,500 చొప్పున 9,725 మందికి రూ.15.60 కోట్ల ఆర్థిక సాయం అందినా 2,170 కుటుంబాలకు ఎదురుచూపులే మిగిలాయి.
ఖాళీగా దర్శనమిస్తూ..
మున్నేరు పరీవాహక ప్రాంతంలోని అనేక ఇళ్లకు ఇంకా టు – లెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఏటి సమీపాన దెబ్బతిన్న ఇళ్లకు కొందరు మరమ్మతు చేయించకుండానే వదిలేశారు. ఇళ్లలో ఉంటున్న వారు కూడా ౖపైపె మరమ్మతులు చేయించుకుని.. ఏవైనా కార్యాలు ఉంటే రంగులు వేయించుకుంటున్నామని చెబుతున్నారు.