గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన టెట్ను 40 శాతం పాస్ మార్కులతో ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు గుడిపాటి దాస్, మహమ్మద్ ఖాలీద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కన్నావారితోటలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు నివ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాసిన టెట్కు కనీసం ఫైనల్ కీ ఇవ్వకుండానే మరో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడమే కాక, ఇచ్చిన స్పెషల్ టెట్లో ఎలాంటి సడలింపులు ఇవ్వకపోవడం సరైనది కాదన్నారు. క్వాలిఫైయింగ్ మార్కులు 90, 75, 60 స్థాయిలో కాకుండా, అందరికీ సమానంగా 40 శాతం పాస్ మార్కులుగా ఉంచాలన్నారు. మహ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ లెక్కలు, సైన్సు సబ్జెక్టులు వారు సబ్జెక్టులు కాకుండా వేరే సబ్జెక్టులు చదివి టెట్లో ఉత్తీర్ణులు కావాలనడం ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేయడమేనని అన్నారు. సమావేశంలో సంఘ జిల్లా కార్యదర్శులు పి.లక్ష్మీ నారాయణ, పి. శివరామకృష్ణ, వట్టిచెరుకూరు ప్రధాన కార్యదర్శి బి.గురుమూర్తి, సీనియర్ కార్యకర్త సాధనాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


