మదనపల్లె టౌన్ : కడుపు నొప్పి తాళ లేక ఓ యువతి ఇంటి ముందు కల్లాపి చల్లే పసుపు రంగు కెమికల్ పౌడర్ నీళ్లలో కలిపి తాగి ఆత్మహత్యకు యత్నించింది. శుక్రవారం రాత్రి బి.కొత్తకోట మండలంలో జరిగిన ఘటనపై బాధితురాలి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని బడికాయలపల్లికి చెందిన రామకృష్ణ భార్య ఎన్.సుమిత్ర(32) కడుపు నొప్పి తాళలేక ఇంట్లో ఉన్న కల్లాపి చల్లే పౌడర్ నీళ్లలో కలిపి తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు. అనంతరం వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బి కొత్తకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
రాజంపేట : పట్టణంలోని బండ్రాళ్లవీధిలో నారాయణ రాఘవ గుప్తా(21) శనివారం ఇంటిలో ఫ్యాన్కు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు చేరుకొని, మృతుని సంబంధీకులను విచారించారు. మృతుడు బెంగళూరులో బిజినెస్ మేనెజ్మెంట్ కోర్సు చేస్తున్నట్లు తెలిసింది. కోర్సులో ఫెయిల్ కావడంతో కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. పోస్టుమార్టరం నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయవైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మిద్దైపె నుంచి పడి వ్యక్తికి గాయాలు
మదనపల్లె టౌన్ : మిద్దె మెట్లపై నుంచి పడి మదనపల్లె స్పిన్నింగ్ మిల్ రిటైర్డ్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘటనపై బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మదనపల్లి మండలం సిటిఎంకు చెందిన శ్రీనివాసులు(67) గతంలో సిటిఎం స్పిన్నింగ్ మిల్లులో ట్విస్టింగ్ విభాగంలో కార్మికుడిగా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. రాత్రి నిద్రపోయేందుకు మిద్ది పైకి వెళ్లిన శ్రీనివాసులు, నీళ్లు తాగడానికి మెట్ల పైనుంచి కిందికి దిగుతుండగా, ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు.


