మదనపల్లె సిటీ : మదనపల్లె జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంత్సరానికి 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 10వతేదీ వరకు గడువు పెంచినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఎం.గీత తెలిపారు. ప్రవేశ పరీక్ష నవంబర్ 11న జరుగుతుందన్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులని పేర్కొన్నారు.
11 నుంచి
జిల్లా స్థాయి క్రీడా పోటీలు
బి.కొత్తకోట (పెద్దతిప్పసముద్రం) : అమరావతి చాంపియన్ షిప్ 2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈ నెల 11 నుంచి జరుగుతాయని క్రీడాకారుల నియోజకవర్గ ఇన్చార్జి ఎస్ తాజ్బాషా (పీడీ) శనివారం పేర్కొన్నారు. గత నెలలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని జిల్లాకు ఎంపికై న వారు అర్హులన్నారు. ఈ నెల 11న రాయచోటిలోని నేతాజీ గ్రౌండ్లో వాలీబాల్, కబడ్డీ, కోకో, బాక్సింగ్ పోటీలు, వాయల్పాడులోని సీఎస్ఆర్ అకాడమీలో బాస్కెట్బాల్, చెస్ పోటీలు, ఈ నెల 13న బీటీ కళాశాల మైదానంలో హాకీ, అథ్లెటిక్స్, యోగా, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, మదనపల్లెలోని డీఎస్కే స్ఫోర్టిఫైలో బ్యాడ్మింటన్ పోటీలు రాష్ట్ర స్థాయి ఎంపిక కోసం జరుగుతాయన్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనబరిచి వారు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని పీడీ వెల్లడించారు.
ఒంటిమిట్ట రామయ్యకు స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శనివారం సీతారామలక్ష్మణులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు మూల విరాట్కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు తులసి గజమాలలతో స్వామి, అమ్మవార్లను అలంకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. రెండవ శనివారం కావడంతో స్వామి వారిని దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.
ఘనంగా
జిల్లా యోగా పోటీలు
మదనపల్లె సిటీ : స్థానిక పీ అండ్ టీ కాలనీలోని నవ చైతన్య భారతి పాఠశాలలో శనివారం జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది బాల,బాలికలు వివిధ కేటగిరీల్లో పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు చైతన్య మాట్లాడుతూ యోగాతో మంచి శరీర ఆకృతిని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని పొందొచ్చని తెలిపారు.కార్యక్రమంలో పరిశీలకులు మనోహర్, వెంకటరమణ, అనిత, జలజలు విజేతలైన క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరు త్వరలో విశాఖపట్టణంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
ఐఐసీటీ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్గా ఎంపిక
కడప ఎడ్యుకేషన్ : యోగివేమన యూనివర్సిటీ భౌతికశాస్త్ర విభాగం నుంచి ఇటీవల డాక్టరేట్ అందుకున్న పార్నపల్లి ముని మౌనిక ప్రఖ్యాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి), హైదరాబాద్లో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్గా ఎంపికయ్యారు. ఫిజిక్స్ ప్రొఫెసర్ ఎం.రాఘవేంద్ర పర్యవేక్షణలో ఈమె పరిశోధన పూర్తి చేశారు. మౌనిక ను వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అభినందించారు.


