● ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు
● భర్తను అరెస్టు చేయగానే దీక్షలో కూర్చున్న ఎమ్మెల్సీ సతీమణి
సాక్షి ప్రతినిధి, కడప : శాంతియుతంగా నిరసన చేపడుతున్నా ఆ ఎమ్మెల్యేకి నచ్చలేదు. వెంటనే నిరసన దీక్షను కట్టడి చేయాలని పోలీసులకు హుకూం జారీ చేశారు. అంతే.. జీ హుజూర్ అంటూ పోలీసులు నోటీసు జారీ చేశారు. అంతటితో ఆగక ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగిస్తున్న నిరసనపై ఉక్కుపాదం మోపారు. శనివారం జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రజాస్వామ్యయుత దీక్షపై ఖాకీలు సాగించిన క్రౌర్యమిది. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలపై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆద్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తుంటే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి నచ్చలేదు. వైఎస్సార్సీపీ దీక్ష భగ్నం చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంతే పోలీసులు స్వామి భక్తి చాటుకుని దీక్షను అడ్డుకోవడానికి యత్నించారు. పోలీసుల చర్యలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రతిఘటించారు. ‘ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నామా’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీక్ష కొనసాగించి తీరతామని మహాత్మగాంఽధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసనకు దిగారు. సీఐ నరేంద్రబాబు నేతృత్వంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు చేరుకోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. దీంతో భారీగా తోపులాట చోటుచేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు బలవంతంగా ఎమ్మెల్సీని కారులో ఎక్కించి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మెల్సీ సతీమణి పొన్నపురెడ్డి ఇందిరమ్మ నిరసన దీక్ష చేపట్టారు. ప్రజల కోసం పోరాడుతుంటే పోలీసులను పెట్టి అడ్డుకుంటారా? అని నిలదీశారు. మహిళ పోలీసులతో ఆమెను కూడా అక్రమంగా అరెస్టు చేశారు.


