గండి ఆలయ అధికారి విశ్వనాథ్
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో ఈ నెల 15 నుంచి జరిగే శ్రావణ మాస ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సహకారమందించాలని ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్ కోరారు. శనివారం గండి ఆలయ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు విద్యుత్, వైద్యం, విద్యుత్, పారిశుధ్యం, ఆర్డబ్ల్యూఎస్, ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. ఉత్సవాలకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు. అంతకు ముందు కడపకు చెందిన మోహన్ అనే వ్యక్తికి రు.4.90,000 లకు పూల అలంకరణ టెండరు ఖరారు చేసినట్లు తెలిపారు. సెల్ ఫోన్లు భద్ర పరచుకొనే హక్కు విషయంలో సమంజసమైన ధర రానందున దేవస్థానం తరఫునే నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటస్వామి, పాలక మండలి సభ్యులు, ఆర్కే వ్యాలీ సీఐ శంకర్ రెడ్డి,ఎస్సై శ్రీప్రియ, చక్రాయపేట వైద్యాధికారిణి ఊర్మిళ పాల్గొన్నారు.


