వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో ఆంధ్ర క్రికెట్, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్జోన్ అండర్ 23 ఉమెన్స్ వన్డే క్రికెట్ అంతర్ జిల్లాల పోటీలను శనివారం ప్రారంభించారు. శనివారం గ్రౌండ్ 1లో కర్నూల్ టీం, నెల్లూరు అండర్ 23 ఉమెన్స్ క్రికెట్ టీంలు తలపడ్డాయి. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెల్లూరు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 312 పరుగులు చేసింది. అనంతరం 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్నూల్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 283 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. దీంతో 29 పరుగుల తేడాతో నెల్లూరు జట్టు విజయదుందుభి మోగించింది. నెల్లూరు జట్టుకు చెందిన స్వాత్విక రెడ్డి 85 బంతుల్లో 77 పరుగులు, ఆలాసహార్ 58 బంతుల్లో 48 పరుగులు, సాయిలక్ష్మీ 35 బంతుల్లో 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. నెల్లూరు జట్టు బౌలర్లు శారద, రేష్మ కర్నూలు జట్టుకు 47 పరుగులు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు అందుకున్నారు.గ్రౌండ్ 2లో చిత్తూరు, కడప జిల్లా జట్టు తలపడ్డాయి. తొలత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చిత్తూరు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 342 పరుగుల భారీ స్కోర్ చేసి ప్రత్యర్థి జట్టుకు సవాల్ విసిరింది. అనంతరం 348 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన కడప జిల్లా జట్టు 46 ఓవర్లలోనే 180 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. దీంతో చిత్తూరు జిల్లా జట్టు 162 పరుగులతో భారీ విజయం అందుకుంది. చిత్తూరు జిల్లా జట్టుకు చెందిన గ్రీష్మ 64 బంతుల్లో 64 పరుగులు, ప్రణితయాదవ్ 57 బంతుల్లో 62 పరుగులు నాటౌట్, రుష్మిత 44 బంతుల్లో 34 పరుగులు నాటౌట్తో ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, ఉపాధ్యక్షుడు శ్రీధర్ కుమార్, సెక్రటరీ సతీష్యాదవ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా చీఫ్ కోచ్ సునీల్కుమార్, కోచ్లు అనిత, మౌనిక, యామిని, శేఖర్, మాధవి, రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగం పేరిట మోసం: రూ. 7.30 లక్షలు స్వాహా
ఒంటిమిట్ట : బీటెక్ చదివిన యువతికి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.7,30,000 నగదు వసూలు చేసి మోసగించిన దంపతులపై ఒంటిమిట్ట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంటిమిట్ట సమీప గ్రామానికి చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం తన బయోడేటాను ఆన్లైన్లో ఉంచింది. దీనిని ఆసరాగా చేసుకున్న వైజాగ్కు చెందిన భార్యాభర్తలు సురేష్, కావ్య ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. ఈ ఏడాది జనవరి నుంచి విడతలవారీగా రూ.7.30 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం గురించి అడిగితే సమాధానం చెప్పకపోగా, కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమంటే చంపేస్తామని బెదిరించారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హోటల్కని వెళ్లిన వ్యక్తి అదృశ్యం
శంషాబాద్ రూరల్ : ఇంటి యజమానితో కలిసి భోజనం తేవడానికి హోటల్కు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. శంషాబాద్ ఇన్స్పెక్టర్ వై.సురేందర్రెడ్డి కథనం ప్రకారం.. ఏపీలోని కడప వాసి పలగిరి రాజమోహన్రెడ్డి(29) భార్య దామిని, కొడుకుతో కలిసి ముచ్చింతల్లో కొంత కాలంగా అద్దెకు ఉంటున్నారు. దామిని జిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్య అభ్యసిస్తోంది. జూలై 31న రాత్రి ఇంటి యజమాని శివప్రసాద్తో కలిసి రాజమోహన్రెడ్డి తన కారులో భోజనం తేవడానికి పాల్మాకులలోని ఓ హోటల్కు వెళ్లి తిరిగి వచ్చారు. భోజనం పార్సిల్ను ఇంట్లో ఇవ్వడానికి వెళ్లగా రాజమోహన్ బయట నిలబడి ఉన్నారు. శివప్రసాద్ తిరిగి వచ్చి చూసేసరికి అతడు కనిపించలేదు. అన్నిచోట్ల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో శనివారం దామిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బ్లేడుతో దాడి కేసులో ఇద్దరు అరెస్ట్
వేంపల్లె : వేంపల్లెలోని రాజీవ్ కాలనీలో జరిగిన బ్లేడుతో దాడి కేసులో సాయికిరణ్, ఆంజనేయులును అరెస్టు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. కూలీ పనికి రానందుకు మేసీ్త్రలు వెంకటరమణ, నరసింహులు గత నెల 30వ తేదీన తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇంటి దగ్గరికి వెళ్లగా.. ఇరివురి మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దాడిలో సాయి కిరణ్, ఆంజనేయులు బ్లేడుతో దాడి చేయడంతో వెంకటరమణ, నరసింహులుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేసి సాయికిరణ్, ఆంజనేయులును అరెస్టు చేసి శనివారం పులివెందుల కోర్టుకు హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు.


