కురబలకోట : మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కాంగోకు చెందిన డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్కుమార్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా బోధన, ఫలితాల ఆధారిత సిలబస్ రూపకల్పన, కోర్సు మెటీరియల్ అభివృద్ధి, అధ్యాపకుల శిక్షణ, అకడమిక్ మెంటరింగ్ వంటి సేవలను మిట్స్ అందించనుందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఒప్పందం ఉన్నట్లు వివరించారు.
యువతి అదృశ్యంపై కేసు నమోదు
పుంగనూరు : మండలంలోని కంటేపల్లికి చెందిన 19 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. శనివారం బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ గణేష్ కేసు నమోదు చేశారు. బీఎస్సీ చదువుతున్న విద్యార్థిని మూడు రోజుల కిందట కళాశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : అప్పుల బాధతో ఓ రైతు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం బి.కొత్తకోట మండలం కుర్రోళ్లపల్లెలో చోటు చేసుకుంది. బాధితుడి భార్య రత్నమ్మ వివరాల ప్రకారం.. బి కొత్తకోట మండలంలోని కుర్రోళ్లపల్లెకు చెందిన శంకరప్ప (51) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పాడి ఆవులు, వ్యవసాయం కోసం చేసిన అప్పులు సుమారు రూ.5 లక్షల వరకు పేరుకుపోయాయి. రుణదాతల ఒత్తిళ్లు అధికంకావడంతో జీవితంపై విరక్తితో చెంది వ్యవసాయ పొలంలొనే విషం తాగాడు. సాయంత్రం వరకు భర్త ఇంటికి రాలేదని భార్య రత్నమ్మ పొలం వద్దకు వెళ్లి చూడగా, భర్త అప్పటికే విషం తాగేసి ఉండటం చూసి వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కొత్తకోట పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
ప్రమాద సంఘటనపై కేసు
మైదుకూరు : మైదుకూరు మండలం టి.కొత్తపల్లె వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు శనివారం తెలిపారు. తిప్పిరెడ్డిపల్లెకు చెందిన కశెట్టి సుబ్బరాయుడు తన మనవడు యాపరాల శివతో కలిసి మోటార్ బైక్పై వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై సుబ్బరాయుడు అల్లుడు యాపరాల సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.


