
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ఈనెల 18వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా రూట్ మ్యాప్ను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాసు మహేష్ రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ కన్వీనర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా రాగానే అరాచకం మొదలైందని.. అందుకు నిలువెత్తు నిదర్శనం నాగమల్లేశ్వర రావు ఆత్మహత్యేనన్నారు. రాష్ట్రంలో ఏడాదిగా అరాచక పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగుతోంది. కార్యకర్తలు, నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్తలు, నాయకులపై అక్రమంగా కేసులు పెట్టిన వారిని ఎవరిని వదలమన్నారు.

మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పరాకాష్టకు చేరుకుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 18వ తేదీన సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల లో వైఎస్ జగన్ పర్యటిస్తారు. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లును పరిశీలిస్తున్నాం.