మహిళలకు జగన్‌ ‘ఆసరా’  | Sakshi
Sakshi News home page

మహిళలకు జగన్‌ ‘ఆసరా’ 

Published Tue, May 30 2023 4:08 AM

YSR Zero Interest Scheme is back to life - Sakshi

సాక్షి, అమరావతి : చంద్రబాబు నయవంచనతో రాష్ట్రంలో కుదేలైన పొదుపు సంఘాల వ్యవస్థకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తిరిగి జీవంపోసింది. 2019 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏప్రిల్‌ 11 నాటికి వాటి పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తం నాలుగు విడతల్లో వారికి చెల్లించేలా ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని అమలుచేయడంతో తిరిగి ఆ వ్యవస్థ గాడిలో పడింది. మన రాష్ట్రంలోని పొదుపు సంఘాల వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పావలా వడ్డీ పథకం ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో దాదాపు ప్రతి పేదింటి మహిళ ఈ పొదుపు సంఘాల్లో సభ్యురాలైంది. రాష్ట్రంలో ఈ పురోగతిని చూసి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకానికీ శ్రీకారం చుట్టింది. మరోవైపు.. వైఎస్‌ ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళలు ప్రతినెలా ఎంతోకొంత పొదుపు చేసుకోవడం.. కుటుంబ అవసరాలకు సంఘం సభ్యులు ఉమ్మడిగా బ్యాంకుల నుంచి లోను తీసుకోవడం.. తిరిగి సకాలంలో అవి చెల్లించేవారు.

ఈ సమయంలో 2014 ఎన్నికల ముందు, మహిళలెవరూ డ్వాక్రా రుణాలు చెల్లించవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. వాటిని మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు. అప్పట్లో సంబంధిత శాఖ మంత్రిగా పనిచేసిన పరిటాల సునీత ఈ వి షయాన్ని అసెంబ్లీలో లిఖితపూర్వకంగా ప్రకటించారు.

దీంతో అప్పటివరకు దేశా నికి ఆదర్శంగా నిలిచిన ఏపీలో పొదుపు సంఘాల వ్యవస్థ పూర్తిగా నిర్విర్యమైంది. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకు రుణాలు చెల్లించని మహిళలు ఆ రుణాలపై వడ్డీ, చక్రవడ్డీలు పెరిగి బ్యాంకుల వద్ద డిఫాల్టర్లుగా మారారు. చివరకు.. ఒక దశలో వారు తమ రోజువారీ పొదుపు సంఘాల కార్యక్రమాలను దూరంపెట్టారు.   

సంఘాలకు జగన్‌ పూర్వవైభవం.. 
కానీ, వైఎస్‌ జగన్‌ 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. ‘పొదుపు’ మహిళల పేరిట అప్పటివరకు ఉన్న రూ.25,517 కోట్ల అప్పును వారికే నేరుగా నాలుగు విడతల్లో చెల్లించేందుకు సీఎం హోదాలో ఆయన వైఎస్సార్‌ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మూడు విడతల్లో మొత్తం రూ.19,178.17 కోట్లను నేరుగా ఆయా మహిళల ఖాతాల్లో ఆయన జమచేశారు.

మరోవైపు.. సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించే పొ­దుపు మహిళలకు ప్రభుత్వం వడ్డీ చెల్లించే విధానానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుడితే.. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దానికి మంగళం పాడింది. కానీ, వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో మహిళలు తిరిగి పొదుపు సంఘాల కార్యక్రమాలపట్ల ఆసక్తి పెంచుకున్నారు.

అలాగే, చంద్రబాబు తీరుతో అప్పట్లో 60 శాతం పైబడి సంఘాలు సీ, డీ గ్రేడ్‌లకు పడిపోతే.. ఇప్పుడు రాష్ట్రంలో 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్‌లో కొనసాగుతున్నాయి. ఫలితంగా దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలు 99.5 శాతం మేర తమ రుణాలు సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారు.   

Advertisement
Advertisement